రాహుల్ ప్రభావం: కాంగ్రెస్కు సచిన్ పైలట్ గుడ్బై... బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా..?
జైపూర్: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ కొనసాగుతారా లేదా అన్న డైలమా ఇంకా పార్టీలో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తెరపైకి మరొక ఈక్వేషన్ వస్తోంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ చీఫ్గా రాజీనామా చేస్తే రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన పైలట్ కూడా తనపదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నుంచి కూడా తప్పుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. సచిన్ పైలట్తో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఇదే కోవలో నడుస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీడేది లేదని సచిన పైలట్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటోందని పార్టీని వీడే ప్రసక్తే లేదని సచిన్ పైలట్ చెప్పారు.
రాహుల్ రాజీనామా చేస్తే సచిన్ భవితవ్యం ప్రశార్థకం
2014లో రాజస్థాన్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్గా సచిన్ పైలట్ నియామకం వెనక రాహుల్ గాంధీ కృషి ఉందనేది బహిరంగ రహస్యం. ఇక గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత సచిన్ పైలట్ను డిప్యూటీ సీఎంగా కూడా నియమించడంలో రాహుల్ హస్తం ఉంది. ఇక అలాంటి అగ్రనాయకుడే తన పదవికి రాజీనామా చేస్తానని భీష్మించుకుని కూర్చోవడంతో సచిన్ పైలట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని పలువురు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 100 మంది ఉండగా, బీజేపీ ఎమ్మెల్యేలు 73 మంది, బీఎస్పీకి ఆరు, రాష్ట్రీయ లోక్తంత్రిక్ పార్టీకి ముగ్గురు, కమ్యూనిస్టు పార్టీకి ఇద్దరు, భారతీయ ట్రైబల్ పార్టీకి ఇద్దరు, ఆర్ఎల్డీకి ఒక్కరు, మరో 13 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
ఇదీ రాజస్థాన్ పొలిటికల్ పిక్చర్
ఇక అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి బీఎస్పీ 12 మంది స్వతంత్రపార్టీ సభ్యుల మద్దతు ఉంది. ప్రస్తుతం బీజేపీ భారీ మెజార్టీతో లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బీఎస్పీ ఎమ్మెల్యేలు గవర్నర్ కల్యాణ్ సింగ్ను కలుస్తారని అంతా భావించినప్పటికీ అది కాస్త చివరి నిమిషంలో సమావేశం రద్దు అయ్యింది.ఇక రాష్ట్ర మంత్రి కాంగ్రెస్ నేత లాల్చంద్ కటారియా తన పదవికి రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాపై ఇంకా ముఖ్యమంత్రి గెహ్లాట్ కానీ గవర్నర్ కానీ నిర్ధారించలేదు. ఇదిలా ఉంటే సచిన్ పైలట్ చదువుకున్న వాడని,తెలివిగల వాడని రైతు పక్షపాతి అనే ముద్ర వేసుకున్న వ్యక్తి అని అలాంటి వాడు దేశంలో ఎక్కడైనా సరే సేవలు అందించగలరని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ఆయనకు కొత్త బాధ్యతలు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి.
బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం
ఇక రాజస్థాన్ పీసీసీ చీఫ్గా సచిన్ పైలట్ పదవీ కాలం ముగిసింది. అయితే లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఆయన పదవిని అక్టోబరు వరకు పొడగించారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సచిన్ పైలట్ను తప్పుకోమని ఆదేశాలు ఇస్తే రాజస్థాన్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలున్నాయి. సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీకి దూరమై తన వర్గం ఎమ్మెల్యేలు, ఇతర స్వతంత్ర అభ్యర్థులతో పాటుగా మరికొందరి బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఇలా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సచిన్ పైలట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్ అయినప్పటికీ ... చివరి నిమిషంలో సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ను ఆ కుర్చీ వరించింది. పార్టీకోసం ఐదేళ్లు కష్టపడి చివరకు ముఖ్యమంత్రి కుర్చీ గెహ్లాట్కు వెళ్లడాన్ని పైలట్ జీర్ణించుకోలేకపోయారు. ఇక లోక్సభ ఎన్నికల్లో తన వంతు కృషి చేసినప్పటికీ అనుకున్నంత ఫలితాలు రాకపోవడంతో రాజస్థాన్ కాంగ్రెస్లో లుకలుకలు ప్రారంభమైనట్లు సమాచారం.