వసుంధరా సర్కార్ కాలా ‘కానూన్’!: మీడియా స్వేచ్ఛకూ సంకెళ్లు.. అనుమతి లేనిదే దర్యాప్తునకు నో
న్యూఢిల్లీ : జడ్జీలకు, ప్రభుత్వ సర్వెంట్లకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వారిపై ప్రాథమిక దర్యాప్తునకు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని బీజేపీ నాయకురాలు వసుంధరా రాజె సింధియా సారథ్యంలోని రాజస్థాన్ అసెంబ్లీలో నేర చట్టాల సవరణ బిల్లు-2017ను ప్రవేశ పెట్టింది. దీనిపై గత నెల ఏడో తేదీన ఆర్డినెన్స్ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ దేశంలో వేళ్లూనుకుంటున్న అవినీతిని కూకటి వేళ్లతో సహా నిర్మూలిస్తామని చెప్తున్నది. ఈ తరుణంలో వసుంధరా రాజె సింధియా ప్రవేశ పెట్టిన ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఎలా సమర్థిస్తుంది? అత్యున్నత స్థానాల్లో అవినీతిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను రాజస్థాన్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఉల్లంఘించడం లేదా? రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఈ బిల్లుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా వసుంధర రాజే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హోంశాఖ మంత్రి గులాబ్చంద్ కటారియా బిల్లును సోమవారం బిల్లును ప్రవేశపెట్టారు.
స్వతంత్ర ఎమ్మెల్యే మానిక్ చంద్ ఈ బిల్లును నల్ల చట్టంగా అభివర్ణించారు. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని విధిస్తున్నదని ఆరోపించారు. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) సభ్యులు వాకౌట్ చేశారు. ఇద్దరు అధికార బీజేపీ ఎమ్మెల్యేలు సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లు ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తున్నదని, అవినీతిపరులైన ప్రజాప్రతినిధులు, అధికారులను కాపాడుకునేందుకే దీనిని తీసుకొచ్చారని బీజేపీ ఎమ్మెల్యేలు ఘనశ్యామ్ తివారి, నర్పత్ సింగ్ రజ్వీ విమర్శించారు. బిల్లుపై ప్రశ్నించేందుకు అనుమతి కోరగా స్పీకర్ నిరాకరించడంతో రెండుసార్లు వాకౌట్ చేశారు.
గవర్నర్ ఆమోదిస్తే కేంద్ర హోంశాఖ పర్మిషనిచ్చినట్లే?
ప్రభుత్వ సర్వెంట్ల పరిధిలోకి సీఎం వసుంధర రాజె సింధియా, ఆమె క్యాబినెట్ మంత్రులు, శాసన సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు వస్తారు. పదవిలో ఉన్న పబ్లిక్ సర్వెంట్లతోపాటు పదవీ విరమణ చేసిన వారిని కూడా విచారించాలన్నా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అంటే, వసుంధర రాజే దగ్గరి నుంచి ఆమె మంత్రివర్గ సహచరులపై అవినీతి ఆరోపణలు వచ్చినట్లయితే వారు ఆ పదవుల నుంచి తప్పుకున్నా వారి విచారణ కోసం తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలన్న మాట. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే విచారణ చేపట్టొదు. ఈ మేరకు కేంద్ర క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని 156వ సెక్షన్లో రాష్ట్ర ప్రభుత్వం సవరణ తెచ్చింది. కేంద్ర చట్టంలో సవరణ తేవాలంటే రాష్ట్ర గవర్నర్ దానికి తప్పనిసరి ఆమోదం తెలిపాల్సి వచ్చింది. ఇలాంటి చట్టాల విషయంలో గవర్నర్ ఆమోదమంటే కేంద్ర హోం శాఖ అనుమతి ఉన్నట్లే లెక్క. ఈ ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రమాదకర సవరణ కూడా తెచ్చింది. అవినీతి ఆరోపణల కేసుల్లో విచారణకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయక ముందే నిందితుల పేర్లను, వారి వివరాలను వెల్లడించిన జర్నలిస్టులకు రెండేళ్ల జైలు లేదా జరిమానా విధించాలన్నదే ఆ సవరణ.
లక్ష్మణ రేఖ తప్ప మీడియా స్వేచ్ఛను హరించలేమన్న సుప్రీం
రాజస్థాన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సవరణ బిల్లు.. అవినీతి వ్యతిరేక కార్యకర్త, ప్రముఖ జర్నలిస్ట్ వినీత్ నారాయణ్ కేసులో 1997లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఉంది. కొన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే అవినీతి ఆరోపణల విషయమై సీబీఐ విచారణపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం చెల్లదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదన్నది ఈ కేసులో తీర్పు సారాంశం. జాయింట్ సెక్రటరీ స్థాయి, అంతకన్నా పై స్థాయి ఉద్యోగుల విచారణకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరని ‘ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్'లోని నిబంధనను 2014లో సుప్రీం కోర్టు కొట్టివేయడం కూడా ఇక్కడ గమనార్హం. చట్టం ముందు అందరూ సమానమని, రాజ్యాంగంలోని 14వ అధికరణంను ఉల్లంఘించడమేనని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ బిల్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధమని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. మీడియా స్వేచ్ఛను హరించడంతోపాటు, ప్రజల తెలుసుకొనే హక్కును కాలరాయడమేనని చెప్తున్నారు. మీడియాపై ఆంక్షల విషయమై 2012లో విచారించిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం.. మీడియా నియంత్రణ భావనను వ్యతిరేకించింది. ఏ వార్తలు మాత్రమే రావాలో నిర్దిష్టంగా మార్గదర్శకాలు రూపొందించలేమని స్పష్టం చేసింది. మీడియా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా అభివర్ణించింది. కొన్ని విషయాల్లో మాత్రం లక్ష్మణ రేఖ గీసింది. వార్తల వల్ల పరువుకు భంగం కలిగిందని భావిస్తే బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని తెలిపింది. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాల్ని తుంగలో తొక్కేదిగా ఉన్నది.
మీడియాకు కఠిన శిక్షల వెనక ఆంతర్యం ఏమిటి?
ప్రాథమిక విచారణ జరిపేందుకు కూడా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అంటే పరోక్షంగా కేసు విచారణను కాదనడమే. చాలా కేసుల్లో అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక విచారణ జరపనిదే దర్యాప్తు అధికారులు ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించలేరు. అలాంటప్పుడు వారు ఏదైనా కేసు విచారణకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరినప్పుడు ఆ కేసుకు సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాధారాలను ఎక్కడ నుంచి తేగలరు? ఎలా తేగలరు? పైగా ఇక్కడ అవినీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలకు ఉన్న విచక్షణ లేదా స్వయం ప్రతిపత్తి అధికారాలను దెబ్బతీయడం కాదా? అని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. దర్యాప్తుకు అనుమతి పొందిన కేసుల్లో మాత్రమే నిందితుల పేర్లను వెల్లడించాలని, లేకపోతే జర్నలిస్టులకు రెండేళ్లు జైలు శిక్ష విధించడం అన్న నిబంధన దేన్ని సూచిస్తోంది! ప్రాథమిక దశలోనే అవినీతిని వెల్లడించవద్దనా? నిందితుల పేర్లను వెల్లడించకుండా అవినీతి వార్తలను మీడియా ఎలా కవర్ చేయగలదు? 2జీ స్పెక్ట్రమ్ కేసును తీసుకున్నట్లయితే ఎవరి పేరు లేకుండా ఎలా రాయగలం? ఒకవేళ ప్రస్థావించకపోయినా ప్రధాన నిందితుడు ఏ రాజా అన్న విషయం పాఠకులకు అర్థంకాదా? బోఫోర్స్ కుంభకోణం కేసునే తీసుకుంటే మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ గురించి చెబుతున్నట్లా, కాదా? నిందితుడు ఎవరో తెలుస్తోందన్న కారణంగా కూడా జర్నలిస్టులను శిక్షిస్తారా? అని నిరసిస్తున్నారు.
బిల్లు ఉపసంహరించుకోవాలని ఎడిటర్స్ గిల్డ్ సూచన
రాజస్థాన్లో ఇలాంటి ఆర్డినెన్స్ను తీసుకోవడంలో తమ పార్టీకి ఎలాంటి దురుద్దేశాలు లేవని, తమది అవినీతికి వ్యతిరేకంగా పోరాడే పార్టీ అని కేంద్రంలోని బీజేపీ సమర్థించుకున్నది. మరి బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి చట్టాలనే తీసుకొస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయి? అని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. బెంగళూరులో ఓ ఉక్కు వంతెన నిర్మాణం విషయమై బీజేపీ ఇటీవల చేసిన అవినీతి ఆరోపణలను మీడియా ప్రచురించడంతోపాటు అవినీతిని వెలికితీసేందుకు క్రుషి చేసింది. రాజస్థాన్ లాంటి చట్టం కర్ణాటకలో కూడా ఉంటే మీడియాకు ఆ అవినీతి ఆరోపణలను ప్రచురించే అవకాశం ఉండేది కాదుకదా? ఇదే విషయాన్ని బీజేపీ నేతల దష్టికి తీసుకెళితే ఇలాంటి చట్టాన్ని రాజస్థాన్ ఒక్కటే తేలేదని, ఇంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందని దాటవేస్తూ సమర్థించుకుంటున్నారు. రాజస్థాన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రమాదకరమైన బిల్లును వెంటనే వెనుకకు తీసుకోవాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఈ బిల్లు ప్రజాప్రతినిధులను, అధికారులను, జడ్జిలను తప్పుడు కేసుల నుంచి కాపాడుతున్నట్టు కనిపించినా, నిజానికి మీడియాను వేధించే ప్రధానాస్త్రంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నది. బిల్లుపై పునరాలోచించాలని రాజస్థాన్ ప్రభుత్వానికి సూచించింది. రాజస్థాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ అడ్వకేట్ అజయ్జైన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ బిల్లు మీడియా స్వేచ్ఛను హరించడంతోపాటు, న్యాయవ్యవస్థ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఈ బిల్లు నాశనం చేస్తున్నదన్నారు.