స్పీకర్ సంచలన నిర్ణయం: హైకోర్టు ఆదేశాలపై సుప్రీంలో సవాల్: చట్టసభా హక్కులను ప్రశ్నిస్తారా?
జైపూర్: రాజస్థాన్లో నెలకొన్న పొలిటికల్ హైడ్రామాకు ఇఫ్పట్లో తెరపడేలా కనిపించట్లేదు. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ లేవనెత్తిన తిరుగుబాటు వ్యవహారంతో రాజస్థాన్ కాంగ్రెస్లో చెలరేగిన తుఫాన్.. వీడేలా లేదు. సచిన్ పైలట్పై రాజస్థాన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్పైనా హైకోర్టులో ప్రతికూల ఫలితమే వెలువడింది. ఆయనపై ఎలాంటి చర్యలను తీసుకోకూడదంటూ ఆదేశించింది హైకోర్టు. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో తేల్చుకోవడానికి సిద్ధపడింది రాజస్థాన్ ప్రభుత్వం.
నిశ్శబ్దాన్ని వీడనున్న సచిన్: కొత్త పార్టీ?: కాంగ్రెస్కు నిద్రలేకుండా: ఆ కమ్యూనిటీ ఓటుబ్యాంకు
హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ.. కొద్దిసేపటి కిందటే సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ను దాఖలు చేశారు. స్పీకర్ తరఫున ప్రముఖ న్యాయవాది ఈ పిటీషన్ను దాఖలు చేశార. ఈ సందర్భంగా సీపీ జోషీ జైపూర్లో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే సర్వహక్కులు స్పీకర్కు ఉన్నాయని, దీన్ని న్యాయస్థానాలు ప్రశ్నించలేవని అన్నారు. రాజ్యంగానికి, చట్టసభ రూల్స్ ప్రకారమే తాము శాసనసభ్యులపై అనర్హత వేటు వేస్తామని, దీనిపై హైకోర్టు స్టే ఇవ్వడం సరైనది కాదని చెప్పారు. రాజ్యాంగ సంక్షోభాన్ని పరిష్కరించాలని తాము సుప్రీంకోర్టులో పిటీషన్ను దాఖలు చేసినట్లు చెప్పుకొచ్చారు.
సచిన్ పైలట్ సహా ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేపై స్పీకర్ అనర్హత వేటు వేయగా.. వారు హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు సంచలన ఆదేశాలను జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ వరకు సచిన్ పైలట్, ఆయన వర్గ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇంద్రజిత్ మహంతి, జస్టిస్ ప్రకాశ్ గుప్తాలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.
Recommended Video
దీన్ని సవాల్ చేస్తూ స్పీకర్.. సుప్రీంకోర్టును ఆశ్రయించడం రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల్లో అనూహ్య పరిణామాలకు దారి తీసినట్టయింది. చట్టసభలు, న్యాయవ్యవస్థ మధ్య ఘర్షణ వైఖరికి దారి తీయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టీ సుప్రీంకోర్టు మీదే నిలిచింది. 24వ తేదీలోగా సీపీ జోషీ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ సుప్రీంకోర్టు సమక్షానికి విచారణకు రానుందని చెబుతున్నారు. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థిస్తుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది.