రసకందాయంలో రాజస్తాన్ రాజకీయాలు: సుప్రీంలో పిటిషన్ వెనక్కి తీసుకున్న స్పీకర్, SLP ఫైల్ చేస్తాం..
అనర్హత వేటు, అసెంబ్లీ సమావేశ పరచడం చుట్టూ రాజస్తాన్ రాజకీయాలు కొనసాగుతోన్నాయి. ఈ క్రమంలో రాజస్తాన్ స్పీకర్ సీపీ జోషి అనుహ్య నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఆ పిటిషన్ ఇవాళ విచారణకు రానుండగా.. స్పీకర్ ఉపసంహరించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా సమ్మతించింది. అన్నీ అంశాలతో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని న్యాయవాది ప్రతీక్ కస్లీవాల్ పేర్కొన్నారు. మరోవైపు అసెంబ్లీని సమావేశపరచాలని సీఎం అశోక్ గెహ్లట్ రెండోసారి గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కోరిన ఫలితం లేకపోయింది. ఆయన మరోసారి నో చెప్పారు.
అనర్హతపై హైకోర్టు స్టే..
కాంగ్రెస్ రెబల్ నేత సచిన్ పైలట్ సహా 18 మందికి స్పీకర్ సీపీ జోషి అనర్హత నోటీసులు జారీచేశారు. దీనిని సవాల్ చేస్తూ సచిన్ పైలట్ రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై వాదనలు కొనసాగుతున్నాయి. అనర్హత వేటు వేయడం సరికాదని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసులో తుది తీర్పు వచ్చేవరకు యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు తీర్పునిచ్చింది.
పిటిషన్ విత్ డ్రా..
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ స్పీకర్ జోషి సుప్రీం మెట్లెక్కారు. పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది. ఇంతలో స్పీకర్ తన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. అయితే అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పైలట్ వర్గంపై న్యాయ పోరాటం వద్దు అని.. రాజకీయంగా ఎదుర్కొవాలని నిర్ణయానికి వచ్చింది. అయితే కొందరు న్యాయ పోరాటం చేద్దామనగా, చాలామంది వెనక్కి తీసుకుందామని చెప్పారు. దీంతో రాజకీయంగా ఎదుర్కొనేందుకు సిద్ధమై.. పిటిషన్ వెనక్కి తీసుకున్నారని తొలుత వార్తలొచ్చినా.. తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామని న్యాయవాది తెలిపారు.
బలనిరూపణకు గవర్నర్ నో..
మరోవైపు అసెంబ్లీలో బలం నిరూపించేందుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను సీఎం అశోక్ గెహ్లట్ రెండోసారి కోరారు. శనివారం కూడా అసెంబ్లీని సమావేశపరచాలని కోరిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిర్వహించలేమని గవర్నర్ చెప్పడంతో గెహ్లట్ అండ్ కో రాజ్ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. తర్వాత ఇవాళ మరోసారి 31వ తేదీన అసెంబ్లీని సమావేశపరచాలని కోరగా.. అందుకు గవర్నర్ నిరాకరించారు. దీంతో బలనిరూపణ చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. అయితే గవర్నర్ వెనక బీజేపీ ఉంది అని.. సభను సమావేశం కానీవ్వడం లేదని ఆరోపిస్తున్నాయి.