అవిశ్వాస తీర్మాన నోటీసు..?: గవర్నర్తో రాజే భేటీ, మాయావతి విప్, ఇద్దరు ఎమ్మెల్యేల సస్పెన్షన్ రద్దు..
మరికొన్ని గంటల్లో రాజస్తాన్ అసెంబ్లీ ప్రారంభం అవబోతోంది. సభలో బల నిరూపణ కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని గవర్నర్ను సీఎం అశోక్ గెహ్లట్ కోరడంతో సెషన్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసిన నేత సచిన్ పైలట్ తిరిగి సొంత పార్టీలోకి చేరారు. 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి రావడంతో గెహ్లట్ శిబిరం ఊపిరి పీల్చుకుంది. కానీ బీజేపీ మాత్రం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ట్వీస్ట్ ఇచ్చింది. ఇటు మరోవైపు బీఎస్పీ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చింది. తమ ఆరుగురు ఎమ్మెల్యేలకు విప్ జారీచేసింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలని స్పష్టంచేసింది. దీంతో రాజస్తాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఏమైనా జరుగుతాయా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
గవర్నర్తో రాజే భేటీ
గురువారం సాయంత్రం జైపూర్లోని అశోక్ గెహ్లట్ కార్యాలయం వద్దకు సచిన్ పైలట్ 18 మంది మద్దతుదారులు చేరుకున్నారు. పైలట్, గెహ్లట్ కలుసుకొని.. తమ బలాన్ని ప్రదర్శించారు. సీఎల్పీ సమావేశం ముందు కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని ప్రదర్శించింది. కానీ అంతకుముందు ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా మాత్రం తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తెలిపారు. సభ ప్రారంభం కాగానే నోటీసు ఇస్తామని తెలిపారు. ఇదిలాఉంటే మాజీ సీఎం వసుంధర రాజే కూడా గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కలువడం విశేషం.
అంతా అనుకూలమే..
బీజేపీ అవిశ్వాస తీర్మానంపై గెహ్లట్ స్పందిస్తూ.. పైలట్ రాకముందే తీర్మానానికి అనుకూలం అని... ఇప్పుడు పైలట్ వర్గంతో తాము మరింత బలంగా మారామని పేర్కొన్నారు. రాజస్తాన్ డిప్యూటీ సీఎం, రాజస్తాన్ కాంగ్రెస్ చీఫ్గా ఆరేళ్లు అవకాశం ఇచ్చినందుకు సోనియాకు పైలట్ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాపై గెహ్లట్ విరుచుకుపడ్డారు. వారిద్దరూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. కానీ రాజస్తాన్లో మాత్రం వారి ఎత్తు ఫలించలేదు అని పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు రాజస్తాన్ బీఏసీ సమావేశమవుతోంది. సమావేశంలో విశ్వాస తీర్మానాన్ని గెహ్లట్ తీసుకొస్తారా లేదా బీజేపీ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంటారో చూడాలీ మరీ.
ఎమ్మెల్యేలకు మాయావతి విప్..
మరోవైపు బీఎస్పీ చీఫ్ మాయావతి తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీచేసింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్లో పేర్కొన్నది. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతా బాగే ఉంది అని, కాంగ్రెస్ ఫ్యామిలీ ఐక్యంగా ఉందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో తమ బలం స్పష్టమవుతోందన్నారు. ఇదిలా ఉంటే పైలట్ అనుచరులు భన్వర్ లాల్ శర్మ, విశ్వేంద్ర సింగ్ సభ్యత్వాల రద్దును కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకుంది. గెహ్లట్తో సచిన్ పైలట్ భేటీకి కాస్త ముందు సస్పెన్షన్ రద్దు చేసింది.
గెహ్లట్ సర్కార్ సేఫ్..
రాజస్తాన్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 200 మంది. సభలో బల నిరూపణకు 101 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. బీజేపీకి 75 మంది సభ్యులు ఉండగా.. కాంగ్రెస్ 107 సీట్లతో బలంగా ఉంది.13 మంది ఇండిపెండెంట్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. దీంతో గెహ్లట్ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు. కానీ సభలో తీర్మానం ప్రవేశపెట్టే వరకు ఏం జరుగుతుందో చూడాలీ మరీ.