అత్తింటి వేధింపులతో యువతికి నరకం.. నగ్నంగా పోలీస్ స్టేషన్కు పరుగులు..!
చురూ : అయినవాళ్లందర్నీ వదిలి అత్త వారింటికి చేరిన ఓ మహిళ నిత్యం నరకమే అనుభవించింది. కోటి ఆశలతో కట్టుకున్నవాడి ఇంటికొస్తే జీవితం దుర్భరంగా మారింది. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళకు.. రాజస్థాన్ చురూ జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లైన నాటి నుంచి ఆ మహిళకు వేధింపులు ఎదురయ్యాయి. అన్నింటినీ భరించుకుంటూ వచ్చిన సదరు మహిళను అత్త, ఆడపడుచులు మరింత వేధించారు.
ఆదివారం నాడు ఆ మహిళపై అత్తింటివారు మరోసారి ప్రతాపం చూపించారు. సూటిపోటి మాటలతో వేధిస్తూ చిత్రహింసలు పెట్టారు. ఆమె భర్త పని మీద అసోంకు వెళ్లడంతో వారు ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారు. సాటి మహిళ అని కూడా చూడకుండా క్రూరంగా హింసించారు. చివరకు ఆమె బట్టలు కూడా చింపేశారు. అయితే అప్పటివరకు సహనంతో భరించిన బాధితురాలికి ప్రాణభయం పట్టుకుంది. తాను అక్కడే ఉంటే చంపేసేలా ఉన్నారనుకుని బయటకు పరుగులు తీసింది.
జీతం అడిగితే కన్నెర్రజేశాడు.. యువతిని చితకబాదిన యజమాని (వీడియో)
అలా ఒంటిపై బట్టలు లేకుండానే బాధితురాలు పోలీస్ స్టేషన్ వైపు పరుగులు పెట్టడంతో.. ఆ రోడ్డు వెంబడి వెళ్లేవారు మానవత్వం చూపించలేదు. పైగా కొందరు ఫోటోలు, వీడియోలు తీయడం కలకలం రేపింది. మొత్తానికి ఆమె పోలీస్ స్టేషన్ కు చేరి ఫిర్యాదు చేయడంతో రక్షణ కల్పించారు. అత్తింటివారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె రోడ్డు వెంబడి వస్తున్నప్పుడు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను కూడా తొలగించారు. అయితే ఆ సమయంలో ఫోటోలు, వీడియోలు తీసినవారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు ఉన్నతాధికారులు.