పట్టాలు తప్పిన రాజధాని ఎక్స్ప్రెస్: నలుగురు మృతి
పాట్నా: ఢిల్లీ - డిబ్రూగర్ మార్గంలోని రాజధాని ఎక్స్ప్రెస్ బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఈ ప్రమాదం బీహార్ రాష్ట్రంలోని ఛాప్రా సమీపంలో జరిరగింది.
నలుగురు మృతి చెందిన విషయాన్ని డిఐజి వినోద్ కుమార్ ఎన్డీటివీతో మాట్లాడుతూ ధ్రువీకరించారు. ఛాప్రా నుంచి తెల్లవారు జామున 2 గంటలకు బయలుదేరిన కొద్ది సేపటికే రాజధాని ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది.
ప్రమాదంలో 9 మంది గాయపడినట్లు వినోద్ కుమార్ చెప్పారు. ఈ ప్రమాదం వెనక కుట్ర ఏమీ లేదని ఆయన అన్నారు. డ్రైవర్కు ఏ విధమైన పేలుడు శబ్దం వినిపించలేదని చెప్పారు.
ట్రాక్స్పై శబ్దం రావడంతో రైలును నిలిపేసినట్లు తెలిపారు. రైలుకు చెందిన 11 కోచ్లు పట్టాలు తప్పినట్లు సమాచారం. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మావోయిస్టుల పని కావచ్చునని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమానిస్తోంది.
రైల్వే, స్థానిక అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కుట్ర ఉందని రైల్వే మంత్రిత్వశాఖ అనుమానిస్తుంటే అటువంటదేమీ లేదని బీహార్ పోలీసులు అంటున్నారు.
మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చారని, ఈ నేపథ్యంలోనే ఈ సంఘటనకు వారే పాల్పడి ఉండవచ్చునన రైల్వే మంత్రి సదానంద గౌడ అన్నారు. అయితే, అసలు కారణం మాత్రం తెలియదని ఆయన అన్నారు.