దేశంలోనే అత్యంత దారుణం: కమల్తో పొత్తుపై రజినీ ఏమన్నారంటే?
చెన్నై: తమిళ రాజకీయాలు, రాష్ట్ర పరిస్థితులపై సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో రాజకీయంగానూ, ప్రభుత్వ వ్యవస్థల పరంగానూ అత్యంత దారుణంగా ఉన్న రాష్ట్రం తమిళనాడేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక సహ నటుడు, రాజకీయ అరంగేట్రం చేయబోతున్న కమల్ హాసన్ పార్టీ పొత్తుపై కూడా రజినీకాంత్ స్పందించారు. ఈ ఇద్దరి రాజకీయ అరంగేట్రం తమిళ రాజకీయాలను వేడెక్కిస్తున్న విషయం తెలిసిందే.
కమల్తో కాలమే.. త్వరలోనే
ఈ నేపథ్యంలో రజనీకాంత్ మాట్లాడుతూ.. రాజకీయంగా కమల్ హాసన్ తో కలిసి ముందుకెళ్లే విషయం కాలమే నిర్ణయించాలని అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికలపై త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని రజినీ స్పష్టం చేశారు.
అప్పుడే రజినీతో..: కమల్
ఇది ఇలావుంటే, రజినీ పార్టీతో పొత్తుపై కమల్ హాసన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆ నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ముందు మా రాజకీయ పార్టీ గురించి ప్రకటించాలి. మా ఆలోచనలు, అభిప్రాయాలు ప్రజలకు తెలియజేయాలి. మా ఇద్దరి ఆలోచనలు ఒకటే అయితే రజనీతో కలిసి పనిచేసే విషయం గురించి ఆలోచిస్తా' అని తెలిపారు.
21నుంచి జనంలోకి
కాగా, ఫిబ్రవరి 21 నుంచి కమల్ తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ‘నలై నమదే' అనే పేరు పెట్టారు. ఆయన తొలి పర్యటనను మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్వస్థలమైన రామేశ్వరం నుంచే మొదలు పెట్టనున్నట్లు తెలిపారు.
సాయం మాత్రమే.. ఆ సీఎం స్నేహితుడే..
కేరళ సీఎం పినరయి విజయన్ తనకు రాజకీయ సలహాలు ఇస్తూ సాయం చేస్తున్నట్లు కమల్ హాసన్ తెలిపారు. ‘నాకు రాజకీయాలు అలవాటు లేదు. వాటి గురించి ఏమీ తెలీదు కూడా. అందుకే సీఎం నాకు సాయం చేస్తున్నారు' అని కమల్ వెల్లడించారు. పినరయి విజయన్, కమల్ హాసన్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు కమల్ ప్రకటించిన సమయంలో కూడా పినరయి విజయన్ను కలిశారు. దీంతో కమల్ సీపీఎంతో చేతులు కలుపుతారంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి అప్పుడే కమల్ స్పష్టతనిచ్చారు. విజయన్ తనకు మంచి స్నేహితుడని రాజకీయాల నేపథ్యంలో ఆయన్ని కలవలేదని స్పష్టం చేశారు.