రజనీకాంత్ ఈ పార్టీకే ఓటు వేయాలని చెప్పారట: అన్నాడీఎంకే మాతృపత్రిక నమదు అమ్మ
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తమిళనాడు నీటి సమస్యను ఏ ప్రభుత్వం అయితే పరిష్కరించగలదో అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటూ ఈ మధ్యే ఓటర్లను కోరారు తలైవా. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే అధికారిక పత్రిక నమ్మదు అమ్మలో అన్నాడీఎంకే బీజేపీలతోనే ఇది సాధ్యం అవుతుందంటూ కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేయబోదని రజనీకాంత్ గత ఆదివారం తేల్చి చెప్పారు. ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన రజినీ మక్కల్ మండ్రం పేరుతోనే తన రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుందనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి రజనీ పార్టీ రేస్లో ఉంటుందని సమాచారం. ఇక రజినీ అన్నాడీఎంకే-బీజేపీ-పీఎంకే పొత్తును ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని అన్నాడీఎంకే మాతృపత్రిక నమదు అమ్మ కథనం రాసుకొచ్చింది. కావేరీ జల సమస్య కొన్నేళ్ల నుంచి ఉండగా కేంద్రంలో బీజేపీ సర్కార్, రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వాల చొరవతోనే కావేరీ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని అందుకే రజినీ అన్నాడీఎంకేకే ఓటు వేయాల్సిందిగా తన అభిమానులను కోరారని కథనంలో పేర్కొంది.
తమిళనాడులో మొత్తం 39 లోక్సభ స్థానాలుండగా పీఎంకేకు ఏడు స్థానాలు, బీజేపీకి 5 స్థానాలను అన్నాడీఎంకే కేటాయించింది. పుదుచ్చేరిలో ఒక సీటును ఎన్ఆర్ కాంగ్రెస్కు కేటాయించింది. ఇక కావేరీ- వైకై-కుందారు నదుల అనుసంధానం కోసం కేంద్రం ప్రాజెక్టుకు అయ్యే 90శాతం ఖర్చును కేంద్రం భరిస్తుందని హామీ ఇచ్చిందని పత్రిక రాసుకొచ్చింది. అందుకే నీటి సమస్యను పరిష్కరించగలిగేది ఒక్క అన్నాడీఎంకే బీజేపీలు మాత్రమే అని రజినీ పరోక్షంగా చెప్పారని కథనంలో పేర్కొంది.
ఇక మరోవైపు డీఎండీకే అధినేత విజయ్ కాంత్ను రజనీకాంత్ కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అన్నాడీఎంకేతో సీట్ల పంపకాల చర్చలపై విజయ్కాంత్ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆయన్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయ్కాంత్ను వ్యక్తిగత పరమైన అంశాలపై కలిసినట్లు చెప్పిన రజనీకాంత్ ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకే విజయ్కాంత్ ఇంటికి వచ్చినట్లు రజినీకాంత్ చెప్పారు.