అలా కుదరదు: అభిమానులకు రజినీకాంత్ క్షమాపణ!
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు క్షమాపణ చెప్పారు. తన అభిమాన సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశాలను రద్దు చేసుకుంటున్నట్టు శనివారం ప్రకటించారు. ఏప్రిల్ 12 నుంచి ఐదు రోజుల(16 వరకు) పాటు వివిధ జిల్ల
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు క్షమాపణ చెప్పారు. తన అభిమాన సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశాలను రద్దు చేసుకుంటున్నట్టు శనివారం ప్రకటించారు. ఏప్రిల్ 12 నుంచి ఐదు రోజుల(16 వరకు) పాటు వివిధ జిల్లాల అభిమానులను రాఘవేంద్ర కళ్యాణ మండపంలో జరపనున్న సమావేశానికి హాజరుకావాలని ఆయన పిలుపునివ్వగా.. రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇచ్చేందుకే ఆయన సమావేశాలు ఏర్పాటు చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, శనివారం ఈ సమావేశాలను రద్దు చేస్తున్నట్టు రజనీకాంత్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అందుకు కారణాలు మాత్రం వెల్లడించలేదు. అనివార్య కారణాల వల్ల అభిమానులతో సమావేశాలను రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది.
ఈ సమావేశాల్లో ప్రతి అభిమానితో ఫోటోలు దిగడం సాధ్యం కాదని రజనీ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అందరినీ సంతృప్తపరచలేమన్న ఉద్దేశంతోనే సమావేశం రద్దు చేస్తున్నామని, భవిష్యత్తులో మరోసారి ఇదే తరహా మీటింగ్ జిల్లాల వారీగా పెట్టుకుందామని రజనీ చెప్పారని ఈ ఆడియో ప్రకటన పేర్కొంది.
అప్పుడు అందరికీ తనను కలిసే వీలు కలుగుతుందని, దయచేసి అభిమానులు తన పరిస్థితిని అర్థం చేసుకోగలరని రజినీ కోరారు. అయితే, జయలలిత మృతితో ఖాళీ ఏర్పడ్డ ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 12నే జరగనుంది.
అదే రోజు ప్రారంభం కానున్న ఈ సమావేశాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని, అవి రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయని అందరూ భావించారు. కానీ, అలా జరిగే పరిస్థితి లేకుండా పోయింది. అయితే రజినీ తాజా నిర్ణయంతో అభిమానులు మాత్రం నిరాశకు గురయ్యారు.