రజినీకాంత్ త్వరగా కోలుకునేందుకు వైద్యుల కీలక సూచనలు: చెన్నైలోనే విశ్రాంతి
హైదరాబాద్: అస్వస్థతకు గురై నగరంలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ తమిళ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుం రజినీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బీపీ హెచ్చుతగ్గుల కారణంగానే ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
రజినీకి వారంపాటు పూర్తి విశ్రాంతి
డిశ్చార్జ్ చేసిన వైద్యులు రజినీకాంత్ త్వరగా కోలుకునేందుకు పలు కీలక సూచనలను చేశారు. వారం రోజులపాటు రజనీకాంత్ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో కరోనా సోకే అవకాశం ఉన్న ఏ కార్యక్రమంలోనూ పాల్గొనవద్దని స్పష్టం చేశారు.
చెన్నైకి సూపర్ స్టార్
అదే సమయంలో ఒత్తిడికి గురికాకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని వైద్యులు రజినీకి సూచించారు. గతంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యులు డిశ్చార్జ్ చేసిన క్రమంలో ఆయన చెన్నైలోని తన నివాసానికి వెళ్లనున్నారు. అక్కడే పూర్తిగా కోలుకునేంత వరకు విశ్రాంతి తీసుకోనున్నారు.
రజినీకి కోవిడ్ 19 నెగిటివ్ కానీ..
కాగా, తమిళ సినిమా ‘అన్నాత్తే' షూటింగ్ కోసం డిసెంబర్ 13న రజనీకాంత్ హైదరాబాద్ నగరానికి వచ్చిన విషయం తెలిసిందే. డిసెంబర్ నెలాఖరుకల్లా షెడ్యూల్ పూర్తి చేయాల్సి ఉండటంతో నిత్యం షూటింగ్లో పాల్గొన్నారు. అయితే, ఇటీవల సినిమా షూటింగ్ సెట్లో నలుగురు కరోనా బారినపడటంతో దర్శకుడు శివ షూటింగ్ నిలిపివేశారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా రజినీకాంత్ కోవిడ్ 19 పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. దీంతో ఆయన కోట్లాది అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అయినా కూడా ఆయన సెల్ఫ్ ఐసోలేషన్లోనే ఉంటున్నారు. అయితే, శుక్రవారంనాడు రజినీ కొంత అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.
రజినీ చేయాల్సిన పనులు చాలానే..
గత మూడ్రోజులపాటు ఆస్పత్రి చికిత్స తీసుకున్న అనంతరం ఆయన పూర్తిగా కోలుకోవడంతో ఆదివారం వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం రజినీ తిరిగి షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. అంతేగాక, వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు రాజకీయ పార్టీపై కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. జనవరిలో కొత్త పార్టీని ప్రకటిస్తానని, అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు.