రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ: నాన్ లోకల్ కార్డుతో...
చెన్నై: రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కు తమిళ సంఘాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. స్థానికేతరుడు అనే కారణంతో ఆ సంఘాలు రజనీకాంత్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి.
మరోవైపు ఆయన బిజెపితో కలిసి నడుస్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది. దీంతో ఆయనకు రాజకీయాల్లో ఎదురీత తప్పదనే మాట వినిపిస్తోంది. డిఎంకె మాత్రం ఆచితూచి మాట్లాడుతోంది.
బిజెపితో పెట్టుకుంటే అంతే...
బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రజనీకాంత్ రాజకీయంగా రాణించడం కష్టమేనని డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నారు. తెలిసో తెలియకో బిజెపితో రజినీకాంత్ ఓ అవగాహనకు వచ్చారని, బీజేపీ కూడా ఇలాంటి సంకేతాలే పంపిందిని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా రజినీకాంత్ అంటే ప్రజలకు ఇష్టమేనని, అయితే ఆ పార్టీతో అవగాహన ఏర్పాటు చేసుకుంటే మాత్రం తమిళనాడు ప్రజలు ఆయనను అంగీకరించడం కష్టమని అన్నారు. తమిళనాడులో బీజేపీ పరిస్థితి ఏమిటో తమకు తెలుసునని, తమిళనాడు ప్రజలను బీజేపీ ఎప్పుడూ చిన్నచూపు చూస్తోందని ఆయన అన్నారు.
రజనీపై వీరమణి ఇలా..
మరాఠీ అయిన రజనీకాంత్ తమిళనాడుని పరిపాలించాలనుకుంటే తాము అంగీకరించబోయేది లేదని నామ్ తమిళర్ పార్టీ అధ్యక్షుడు సీమాన్, ద్రవిడ కళగం నేత కె. వీరమణి అన్నారు.
మంచిదంటూనే
ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని, రజనీకాంత్ వస్తానని ప్రకటించారని, అంతే అన్నాడీఎంకేను ఎవరూ నాశనం చేయలేరని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. అన్నాడీఎంకేను నాశనం చేయడానికి ఎవరూ పుట్టబోరని అన్నారు.
రజనీకి శుభాకాంక్షలు
భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని పార్టీ ప్రారంభించవచ్చునని మంత్రి జయకుమార్ అన్నారు. రాజకీయాల్లో ప్రజలే న్యాయనిర్ణేతలని,ఓటర్లే గెలుపోటములు నిర్ణయిస్తారని అన్నారు. ఏడాదిగా తమిళనాట తలదించుకునేలా రాజకీయ సంఘటనలు సంభవించాయన్న రజనీ అన్న విషయాన్ని ప్రస్తావించగా ఆయన ఎక్కడా అన్నాడీఎంకే అన్న మాటే ప్రయోగించలేదని, ఒకవేళ ఆయన తమపై ఆరోపణలు చేసుంటే తగిన బదులు ఇచ్చేవాడిని. ఆ వ్యాఖ్యలు డీఎంకేకి చెంది ఉండవచ్చునని జయకుమార్ అన్నారు.
మాకేం ఢోకా లేదని స్టాలిన్
అభిమానుల ఎదురు చూపులకు రజనీకాంత్ ఫుల్స్టాప్ పెట్టి ఎట్టకేలకు రాజకీయ ప్రవేశం చేస్తారని ప్రకటించారని, ఆయనకు డీఎంకే తరఫున శుభాకాంక్షలని డిఎంకె నేత స్టాలిన్ అన్నారు. రజనీ రాజకీయ ప్రవేశం వల్ల డీఎంకేకు ఎలాంటి నష్టం కలగబోదని, జయాపజయాలను సమానంగా భావిస్తూ ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. రజనీ రాకను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
నా చిరకాల మిత్రుడని..
తన చిరకాల మిత్రుడు ఎట్టకేలకు రాజకీయ ప్రవేశంపై స్పష్టమైన ప్రకటన చేయడం హర్షణీయమని టిఎన్సిసి నేత తిరనావునక్కరన్ అన్నారు. రాష్ట్రంలోని అవినీతి పాలనను వ్యతిరేకించడంతోపాటు కేంద్రంలోని మతతత్త్వ బీజేపీ పాలనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతివ్వాలని కోరుతున్నట్లు తెలిపారు.
చాలా సంతోమని దినకరన్..
రజనీకాంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ అన్నారు. వ్యవస్థను మార్చడం కన్నా ముందు రాజకీయ రంగంలో సక్రమంగా లేని రాజకీయ నేతలను మార్చేందుకు రజనీ ప్రయత్నిస్తే మంచిదని అన్నారు.
వేషధారులను నమ్మరని..
వేషధారుల మాయమాటలను తమిళ ప్రజలు నమ్మి మోసపోయే స్థితిలో లేరని లోకసభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై అన్నారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్లా సినీ ఇమేజ్తో అనాయసంగా అధికారంలోకి వచ్చేస్తామని కలలు కనడం భావ్యం కాదని అన్నారు.
తీవ్రంగా వ్యతిరేకిస్తామని...
రజనీ రాజకీయ ప్రవేశాన్ని నామ్ తమిళర్ కట్చి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సీమాన్ అన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత తమిళులకు లేదా? కావేరి వివాదంలో తమిళులపై దాడి జరిగినప్పుడు, కన్నియకుమారిలో తమిళ జాలర్లు గల్లంత యినప్పుడు, నీట్ వివాదంలో సొదరి అనిత ఆత్మహత్య చేసుకున్నప్పుడు నోరు విప్పని రజనీకాంత్ ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రపంచానికే పాలనపై పాఠాలు చెప్పిన రాష్ట్రం తమిళనాడు అని, అంతటి కీర్తి గడించిన రాష్ట్రాన్ని పాలించే అర్హత తమిళులకు లేదా అని అన్నారు.
వెనుకడుగు వద్దని ఖుష్బూ..
ఎట్టకేలకు అభిమానుల కోరికకు తలవంచిన రజనీకి శుభాకాంక్షలు అని ప్రముఖ నటి, కాంగ్రెసు నాయకురాలు ఖుష్భూ అన్నారు. రాజకీయ ప్రవేశం మంచిదేనని, అయితే రజనీ ఈ నిర్ణయంపై నిలబడాలని అన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ వెనుకంజ వేయకూడదని ఆమె సలహా ఇచ్చారు.
అడ్డుకుంటామని కె.వీరమణి
రజనీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయాన్ని ప్రవేశపెడతానని ప్రకటించడాన్ని ద్రవిడ కళగం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కె వీరమణి అన్నారు. తమిళుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పెరియార్ జన్మించిన భూమి ఇది అని, ఇక్కడ ఆధ్యాత్మికం పేరుతో మతతత్త్వభావాలున్న పార్టీకి తావులేదని అన్నారు. రజనీ మాటమీద నిలబడి ఏ పార్టీలతోనూ పొత్తుపెట్టుకోకుండా 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని పోటికి దింపాలని సవాల్ చేశారు.