ఢిల్లీలో రజినీకాంత్ వరుస భేటీలు: ‘19’లో బీజేపీతో కలిసి వెళతారా?
న్యూఢిల్లీ/చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రకటనే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన రజినీకాంత్.. ఇప్పటిక వరకు పార్టీ పేరును గానీ, విధి విధానాలు కానీ ప్రకటించలేదు.
కేరళలో బీజేపీకి మోహన్ లాల్ 'ట్రంప్కార్డ్'?: మోడీతో భేటీ, ఏం చెప్పారంటే?
బీజేపీతో కలిసి రజినీ..
అయితే, ఇప్పుడు ప్రచారమవుతోన్న మరో వార్త సంచలనంగా మారింది. రజినీకాంత్ వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి వెళతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు తాజాగా జరుగుతున్న పరిణామాలే కారణం కావడం గమనార్హం.
ఢిల్లీలో వరుస భేటీలు..
ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. రజినీకాంత్ వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళతారని వెల్లడించింది. ఇప్పటికే బీజేపీ అధినేత అమిత్ షాతో రజినీకాంత్ భేటీ అయినట్లు తెలిపింది. అంతేగాక, ఢిల్లీ వేదికగా ఇప్పటికే ఏడుసార్లు బీజేపీ పెద్దలతో కలిసి చర్చించినట్లు వెల్లడించింది. కాగా, రజినీకాంత్కు తమిళనాడులో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఒక వేళ ఆయన తన సొంత ప్రకటించి ఎన్నికలకు వెళ్లినా చెప్పుకోదగ్గ ప్రభావం చూపించే అవకాశం ఉంది.
గతం నుంచే బీజేపీ ప్రయత్నాలు..
అయితే, సొంత పార్టీ కన్నా.. బీజేపీతో కలిసి వెళ్లాలని రజినీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, ఇప్పటి వరకు దీనిపై రజినీకాంత్ గానీ, బీజేపీ గానీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అయితే, గతంలో తమిళనాడు బీజేపీ నేతలు మాత్రం గతంలో పలుమార్లు రజినీకాంత్ను బీజేపీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా తమిళనాడు వచ్చిన సమయంలో రజినీకాంత్ను కలిసిన విషయం తెలిసిందే.
బీజేపీకి బూస్టిచ్చినట్లే..
కాగా, లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా, రజినీ-అమిత్ షా భేటీ జరిగినట్లు ప్రచారం జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక వేల రజినీకాంత్.. బీజేపీతో వెళితే మాత్రం ఆ పార్టీకి కలిసివచ్చే అంశంగానే చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో ప్రభావం చూపని బీజేపీ.. రజినీ ఎంట్రీ ఇస్తే మాత్రం చెప్పుకోదగ్గా స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందని మాత్రం చెప్పవచ్చు. కాగా, ఇప్పటికే కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. తిరువనంతపురం లోకసభ స్థానం నుంచి ఆయనను పోటీలో నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం.