Bear Gryll's 'Man vs Wild': షూటింగ్లో రజినీకాంత్కు గాయాలు
బెంగళూరు: డిస్కవరీ ఛానల్లో ప్రసారమయ్యే ప్రముఖ షో 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' డాక్యుమెంటరీ షూటింగ్ కర్ణాటకలోని బందిపుర అడవిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ షో నిర్వాహకుడు బేర్ గ్రిల్స్తోపాటు సూపర్ స్టార్ రజినీకాంత్ ఇక్కడి షూటింగ్లో పాల్గొన్నారు.
గాయపడ్డ రజినీకాంత్..
అయితే, షూటింగ్ సమయంలో రజినీకాంత్ స్వల్పగాయాలపాలయ్యారు. దీంతో డాక్యుమెంటరీ షూటింగ్ నిలిపివేశారు. వెంటనే ఆయనను చికిత్స కోసం తరలించారు. స్వల్ప గాయాలే కావడంతో ఆందోళన అవసరం లేదని అక్కడి వర్గాలు తెలిపాయి.కాగా, డిస్కవరీ ఛానల్ చూసేవారికి మ్యాన్ వర్సెస్ వైల్ షో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోని బేర్ గ్రిల్స్ నిర్వహిస్తుంటారు. ఈ షోకు చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ అనే కాన్సెప్ట్తో ఈ షో నిర్వహించడం జరుగుతోంది.
ప్రధాని మోడీ తర్వాత రజినీనే..
ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ షోకు సంబంధించిన డాక్యుమెంటరీ షూటింగ్లో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్లోని జిమ్కార్బెట్ నేషనల్ పార్కులో మోడీ, బేర్ గ్రిల్స్ సాహసయాత్రను డిస్కరీ ఛానల్ మనోహరంగా చూపించింది. ప్రధాని మోడీ తర్వాత రజినీకాంత్ ఈ షోకు సంబంధించిన డాక్యుమెంటరీ షూటింగ్లో పాల్గొనడం గమనార్హం.
బందిపుర అడవిలో రెండ్రోజుల షూటింగ్
కాగా, బందిపుర అడవిలో రజినీకాంత్ రెండు రోజులపాటు షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. మొదటి రోజు షూటింగ్లోనే రజినీకాంత్ గాయాలపాలవడంతో షూటింగ్ కు విరామం వచ్చింది. ఆయన కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రజినీకాంత్ భుజానికి గాయమైనట్లు తెలుస్తోంది.