మోడీ ఆహ్వానం: తమిళ స్టార్ రజనీకాంత్ వెళ్తారా?
చెన్నై: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కు ఆహ్వానం అందింది. నరేంద్ర మోడీకి, రజనీకాంత్కు మధ్య చాలా కాలంగా స్సేహబంధం కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు రాజధాని చెన్నైకి వెళ్లినప్పుడు నరేంద్ర మోడీ రజనీకాంత్ను కలిశారు.
అయితే, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షను మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించడంపై వివాదం చెలరేగుతోంది. తమిళనాడు రాజకీయ పార్టీలు రాజపక్షను ఆహ్వానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అన్నాడియంకె అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అలాగే, రాజపక్షను ఆహ్వానించడంపై డిఎంకె అధినేత కరుణానిధి కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు. రాజపక్షను ఆహ్వానించడంపై వైగో తీవ్రంగా దండెత్తుతున్నారు. ఎల్టిటిఇ అణచివేతలో భాగంగా చేపట్టిన ఆపరేషన్లో శ్రీలంక తమిళులపై దమనకాండ సాగిందని తమిళనాడు పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ఈ స్థితిలో రజనీకాంత్ మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తారా, లేదా అనేది అనుమానంగానే ఉంది. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తే తమిళుల మనోభావాలను దెబ్బ తీసినట్లవుతుందని భావిస్తున్నారు.