ఇక నో డౌట్స్, జూలైలో ఫిక్స్: కొత్త పార్టీతో తమిళ రాజకీయాల్లోకి రజనీ!?
నా తమ్ముడు అవినీతిని అంతం చేయడానికే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడని రజనీ సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ మీడియాకు వెల్లడించారు.
చెన్నై: సంశయాలు తొలగిపోతున్నాయి.. ఏళ్ల నాటి అభిమానుల నిరీక్షణ త్వరలోనే సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళ గడ్డపై పొలిటికల్ సంతకం చేసేందుకు రజనీ సమాయత్తమవుతున్నారు. ఇన్నాళ్లు ఊహాగానాలకే పరిమితమైన రజనీ రాజకీయం.. త్వరలోనే నిజం రూపం దాల్చబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ఊహించిందే నిజమైంది: 'రజనీ' పొలిటికల్ ఎంట్రీపై ఆందోళనలు, కానీ కబాలి డిసైడెడ్!?
ప్రత్యర్థుల ఆందోళనలను, వ్యతిరేక వర్గాల వ్యాఖ్యలను పక్కనపెట్టి.. తన పొలిటికల్ ఎంట్రీ కోసం రజనీ సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ రజనీ సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్ శుక్రవారం నాడు ఒక ప్రకటన చేయడం దీనికి బలం చేకూరుస్తోంది. వచ్చే జూలైలో రజనీ కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని సత్యనారాయణ రావు గైక్వాడ్ స్పష్టం చేశారు.
సన్నిహితులతో చర్చలు:
రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై తీవ్రంగా చర్చ జరుగుతున్న సమయంలో.. ఇక ఆ ఊహాగానాలకు తెరపెట్టి అధికారిక ప్రకటన చేయాలని రజనీ భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు జూలైలో ప్రకటించబోయే పార్టీ నిర్ణయాల పట్ల సన్నిహితులతో ఆయన చర్చల్లో మునిగిపోయినట్లు తెలుస్తోంది. రజనీ సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ ఇవే విషయాన్ని వెల్లడించారు. పార్టీ పేరు, పార్టీ జెండా, అజెండా, వంటి అంశాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోందని జూలైలో అన్నింటిపై రజనీ స్పష్టతనిస్తారని తెలియజేశారు.
అవినీతిని అంతం చేయడానికే!:
తమిళ రాజకీయాల్లోని అవినీతిని కడిగిపారేసేందుకు రజనీ రాజకీయాల్లోకి దిగుతున్నాడని ఆయన సోదరుడు తెలిపారు. నా తమ్ముడు అవినీతిని అంతం చేయడానికే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడని చెప్పాడు. దీన్ని బట్టి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. ప్రజలకు స్వచ్చమైన పాలన అందించేందుకే రజనీ తన పొలిటికల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
కొత్త పార్టీయే!:
నిన్న మొన్నటిదాకా రజనీ బీజేపీతో దోస్తీ కడుతారన్న ఊహాగానాలు కూడా తెరపై కనిపించాయి. కానీ తమిళ సెంటిమెంటు బలంగా ఉండే రాష్ట్రంలో జాతీయ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం కన్నా సొంత పార్టీతోనే ముందుకెళ్లాలని రజనీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకే కొత్త పార్టీపై సమాలోచనలు జరిపే రజనీ తీరిక లేకుండా గడుపుతున్నట్లు ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.
ఎవరెన్ని విమర్శలు చేసినా!:
భారతీరాజా, కమల్ హాసన్ వంటి సినీ దిగ్గజాలు తన పొలిటికల్ ఎంట్రీపై విమర్శలు చేస్తున్న తరుణంలో.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన తర్వాతే తన స్టామినా ఏంటో చూపించాలని రజనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాటలతో కౌంటర్ ఇవ్వడం కన్నా రాజకీయాల్లో సత్తా చాటడం ద్వారా వారి అభిప్రాయాలు తప్పనే విషయం చాటిచెప్పాలని ఆయన ఆలోచిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద తమిళ రాజకీయాల్లో రజనీ శకం మొదలైనట్లేనన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. జూలై వరకు వేచి చూస్తే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.