కరుణానిధిని కలవనున్న రజనీకాంత్: నిన్న మోడీ వరుసగా, ఏం జరుగుతోంది?
Recommended Video
చెన్నై: తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ బుధవారం డీఎంకే కురువృద్ధుడు కరుణానిధిని కలవనున్నారు. వీరిద్దరి మధ్య భేటీ అనేది తమిళనాట ఆసక్తికర చర్చ సాగుతోంది. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీ మూడు రోజుల క్రితం అంటే డిసెంబర్ 31న ప్రకటన చేశారు.
రాజీనామా చేసేద్దాం: అధికారంపై రజనీకాంత్ షాకింగ్, 'మోడీ కూడా సూపర్ స్టారే'
రజనీకాంత్.. కరుణానిధిని కలుస్తారని, కలైంగర్ (కరుణ) నివాసంలో బుధవారం సాయంత్రం సూపర్ స్టార్ కలవనున్నారని చెబుతున్నారు. ఈ భేటీలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, ఇతర కుటుంబ సభ్యులు, డీఎంకే నేతలు పాల్గొంటారని చెప్పారు.
1980 నుంచి స్నేహం, 1996లో మరింత దృఢబందం
రజనీకాంత్ - కరుణానిధి మధ్య 1980ల నుంచి స్నేహం కొనసాగుతోంది. 1996లో ఇది మరింత బలపడింది. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ డీఎంకేకు మద్దతు ప్రకటించారు. జయలలితకు ఓటు వేస్తే తమిళనాడును ఎవరూ రక్షించలేరని రజనీకాంత్ అప్పుడు చెప్పారు. ఆ ఎన్నికల్లో డీఎంకే అద్భుత విజయం సాధించింది.
రజనీ మద్దతు, కరుణ సీఎంగా
1996లో రజనీకాంత్ మద్దతు కారణంగా డీఎంకే గెలిచి, కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి వారి మధ్య స్నేహం మరింత దృఢమైందని చెబుతారు. అయితే ఆ తర్వాత మరోసారి జయలలితకు రజనీకాంత్ మద్దతు పలకడం గమనార్హం.
ఇది రజనీకాంత్ స్టైల్
రజనీకాంత్ రాజకీయాలకు కొత్త రూపు ఇవ్వాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. తాను పార్టీ స్థాపించినప్పటికీ, ఇతర పార్టీలతో తాను విబేధించినప్పటికీ సీనియర్లతో మంచి స్నేహం ఉండాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే కరుణానిధిని కలుస్తున్నారని చెబుతున్నారు.
ఆసక్తికర భేటీలు
గతంలో ప్రధాని నరేంద్ర మోడీ.. రజనీకాంత్ను రెండుసార్లు కలిశారు. ఇటీవల మోడీ.. కరుణానిధిని కూడా కలిశారు. ఇప్పుడు కరుణను రజనీ కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. తమిళనాట రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతోందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.