రాజకీయాల్లోకి రజనీకాంత్: ఎన్టీఆర్లా ప్రభంజనం సృష్టిస్తారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీ రామారావు ప్రభంజనం సృష్టించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న కాంగ్రెసు పార్టీని చావు దెబ్బ తీశారు.
సినిమాల ద్వారా ఎన్టీ రామారావు మాస్ అపీల్ సంపాదించుకున్నారు. దానికితోడు ఆయనను తెలుగు ప్రజలు దైవంగా కొలిచారు. ఆయన పోషించిన కృష్ణుడు, రాముడు వంటి పాత్రలు ఆయనను మాస్ మాత్రమే కాకుండా క్లాస్ కూడా అభిమానిస్తూ వచ్చారు.
రాష్ట్రంలో రాజకీయ శూన్యతం
ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది. కాంగ్రెసుపై ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కాంగ్రెసుకు ధీటుగా మరో పార్టీ లేదు. కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా బలహీనపడ్డాయి. కాంగ్రెసు నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. అధికారం కోసం తాపత్రయపడడం తప్ప వారికి ప్రజలు కనిపించడం లేదనే అభిప్రాయం బలంగా ఉంది.
అలాంటి శూన్యత తమిళనాడులో ఉందా...
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు ఉన్న రాజకీయ శూన్యత తమిళనాడులో ప్రస్తుతం ఉందా అనేది ప్రశ్న. అలాంటి శూన్యత ఉన్నట్లే కనిపిస్తోంది. ప్రజల ఆకాంక్షల మేరకు ఈపిఎస్ - ఓపిఎస్ ప్రభుత్వం పనిచేస్తుందనే నమ్మకం లేదు. డిఎంకె నేత స్టాలిన్ ఆ నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. శశికళ వర్గం అధికారం కోసం ఏమైనా చేస్తుందనే అభిప్రాయం ఉంది. ఈ స్థితిలో ప్రజలకు సరైన నాయకుడు కనిపించడ లేదు. ఆ సంక్షోభ సమయంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు.
ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం
తరుచుగా ముఖ్యమంత్రులను మార్చడం ద్వారా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాంగ్రెసు దెబ్బ తీస్తోందనే నినాదాన్ని ఎన్టీఆర్ అందుకున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆయనకు ప్రధాన నినాదంగా మారింది. అది ఓ భావోద్వేగ అంశంగా మారి ప్రజలను పెద్ద యెత్తున కదిలించింది. అలాంటి ఆత్మగౌరవ నినాదాన్ని రజనీకాంత్ అందుకునే అవకాశం ఉంది. ఢిల్లీకి ఓపిఎస్-ఈపిఎస్ మోకరల్లుతున్నారనే అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయాన్ని కొంత మంది బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. బిజెపిని ధీటుగా ఎదుర్కోవాలని అనుకుటే రజనీకాంత్ ఈ నినానాద్ని ఎత్తుకోవచ్చు.
ఎన్టీఆర్ చరిష్మా...
ఎన్టీఆర్కు తన చరిష్మా కలిసి వచ్చింది. చివరి రోజుల్లో ఆయన చేసిన పాత్రలు కూడా ఆయనకు కలిసి వచ్చాయి. ప్రజలకు అత్యంత అభిమానమైన నటుడిగా, ఆదర్శవాదిగా కనిపించారు. అలాంటి చరిష్మా రజనీకాంత్కు కూడా ఉంది. రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు.
ప్లాన్ ఎలా అనేది..
ఎన్టీ రామారావు చరిష్మాను ముందు పెట్టి తెలుగుదేశం పార్టీ స్థాపనకు, దాన్ని ముందుకు నడిపిపంచడానికి పక్కా పథక రచన చేసి అమలు చేశారు. నాదెండ్ల భాస్కరరావు వంటి రాజకీయ నేతలు, ఈనాడు దినపత్రిక అధినేత ఎన్టీ రామారావును ముందు పెట్టి కథ నడిపించారు. ఈనాడు ఎన్టీ రామారావుకు ప్రచారం కల్పించిన తీరు ఓ పోరాటాన్ని తలపిస్తుంది. అటువంటి మీడియా మద్దతు, రాజకీయ నిపుణుల ప్లానింగ్ రజనీకాంత్కు అందుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.
మూడు దశాబ్దాల తర్వాత రజనీకాంత్...
ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రభంజనం సృష్టించిన మూడు దశాబ్దాల తర్వాత తమిళనాడులో అటువంటి ప్రభంజనమే సృష్టించడానికి రజనీకాంత్ ముందుకు వచ్చారు. ఈ కాలంలో రాజకీయాలు చాలా మారిపోయాయి. డబ్బులు, తెర వెనక మేనేజ్మెంట్ వంటి అనేక వ్యూహాలు ముుందకు వచ్చాయి. సభలకు ప్రజలు ప్రభంజనంలా వచ్చినంత మాత్రాన విజయం సాధిస్తారనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇటువంటి స్థితిలో రజనీకాంత్ ఎలా నెట్టుకొస్తారనేది ప్రశ్నార్థకమే.