లెటర్ లీక్... రజనీ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ మొదలైన చర్చ... ఇంతకీ తలైవా ఎప్పుడొస్తున్నాడు..
తమిళ రాజకీయాల్లో అడుగుపెడుతానని కొన్నేళ్ల క్రితమే ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్... ఇప్పటివరకూ దానికి కార్యరూపం ఇవ్వలేదు. ఎన్నోసార్లు బహిరంగ వేదికలపై తన పొలిటికల్ ఎంట్రీ పక్కా అని ప్రకటించిన తలైవా... అందుకు ముహూర్తాన్ని మాత్రం ఖరారు చేయడం లేదు. రజనీ తర్వాతే పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేసిన కమల్ హాసన్... ఓవైపు పార్టీ పెట్టేసి... గత లోక్సభ ఎన్నికల్లో తన పార్టీని బరిలో దింపారు. ఇటు రజనీ మాత్రం ఎంతకీ తేల్చకుండా తన పొలిటికల్ ఎంట్రీని నాన్చుతూనే ఉన్నారు. దీంతో అసలు తలైవా రాజకీయాల్లోకి వస్తారా రారా అన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో రజనీ పేరుతో ఓ లేఖ బయటకురావడం... అందులో ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన విషయాలనే పేర్కొనడం ఆసక్తి రేపుతోంది.
రజినీకాంత్ను బీజేపీ ఇబ్బంది పెడుతోందా?: కోర్టుకెక్కిన తలైవా: వేడెక్కిన తమిళ రాజకీయాలు
లేఖలో ఏముంది...
#Rajinikanth హాష్ ట్యాగ్తో ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 'నాకేమవుతుందోనన్న భయం నాకు లేదు. కానీ నా చుట్టూ ఉన్నవాళ్ల క్షేమం గురించి ఆలోచిస్తున్నాను. మార్పు కోసం రాజకీయాల్లోకి రావాలనుకున్నా. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇంటికే పరిమితమవాలని వైద్యులు సూచించారు. నాకు కిడ్నీ సమస్య ఉంది. డయాలసిస్ వల్ల రోగనిరోధక శక్తి తగ్గింది. కాబట్టి ఇలాంటి తరుణంలో బయటకొస్తే ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా సరే.. అది మన శరీరానికి పడుతుందా లేదా అన్నది తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పొలిటికల్ ఎంట్రీపై ఏ నిర్ణయం తీసుకోవాలనేది అభిమానులు,ప్రజలకే వదిలేస్తున్నాను...' అని రజనీ పేరుతో ఆ లేఖ ట్రెండ్ అవుతోంది.
రజనీకాంత్ రియాక్షన్...
సోషల్ మీడియాలో ఈ లేఖ వైరల్గా మారడంతో రజనీ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందారు. దీంతో ఎట్టకేలకు ట్విట్టర్ ద్వారా స్పందించిన రజనీ... ఆ లేఖ తాను రాసింది కాదన్నారు. అయితే అందులో తన ఆరోగ్యం చెప్పిన వివరాలు మాత్రం నిజమేనని పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితుల రీత్యా వైద్యుల సూచనలను పాటిస్తున్నట్లు చెప్పారు. పొలిటికల్ ఎంట్రీపై రజనీ మక్కల్ మండ్రమ్తో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. రజనీ త్వరలోనే మక్కల్ మండ్రమ్తో వర్చువల్ సమావేశం నిర్వహించి పొలిటికల్ ఎంట్రీపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లేదా జనవరిలో ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Recommended Video
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు
తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత రాజకీయ శూన్యత ఏర్పడిందన్న అభిప్రాయాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడేళ్ల క్రితం రజనీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో రజనీ ప్రకటనను కొంతమంది స్వాగతించగా... మరికొందరు వ్యతిరేకించారు. అయితే ప్రకటన చేసి మూడేళ్లు గడిచినా ఇప్పటివరకూ రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టలేదు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో... తలైవా అప్పటివరకైనా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా ఇవ్వరా అన్న చర్చ జరుగుతోంది.