‘రజినీ మండ్రమ్.ఓఆర్జీ’: ఇది రజినీ తొలి అడుగు, ఫ్యాన్స్కు పిలుపు
చెన్నై: రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాజకీయాల్లోకి రావడం ఖాయమని ఆదివారం ప్రకటించిన రజినీకాంత్.. సోమవారమే క్షేత్ర స్థాయి పనులను మొదలుపెట్టారు.
వెబ్ సైట్, యాప్ను లాంఛ్ చేస్తూ అభిమానులకు ఆహ్వానం కూడా పంపారు రజినీకాంత్. ఈ మేరకు రజనీమండ్రమ్.కామ్ పేరుతో ఓ వెబ్ సైట్ను ప్రారంభించి అందులో రజనీ ప్రసంగం వీడియోను ఉంచడం గమనార్హం.
రజినీ పిలుపు
తన రాజకీయ ప్రవేశాన్ని స్వాగతించిన అభిమానులను రజినీకాంత్ ధన్యవాదాలు తెలిపారు. మంచి మార్పు కోసం ఫ్యాన్స్, తమిళ ప్రజలు ఏకతాటిపైకి రావాలని. పార్టీలో వాలంటరీలుగా చేరాలని ఆయన పిలుపునిచ్చాడు.
రజినీ మండ్రమ్ పేరుతోనే..
రజినీ మండ్రమ్ పేరుతోనే యాప్ను కూడా ఆయన ప్రారంభించారు. అయితే, రజినీకాంత్ పార్టీ పేరు మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఉండటంతో ఆయన పార్టీ ప్రకటనకు సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
జయ తర్వాత..
కాగా, సుమంత్ రామన్ అనే రాజకీయ విశ్లేషకుడు రజినీ పొలిటికల్ ఎంట్రీని స్వాగతిస్తూ.. అవసరమైతే రజినీకి సలహాలు ఇస్తానని ముందుకు రావటం విశేషం. దివంగత సీఎం జయలలిత తర్వాత ఆ స్థాయి నాయకుడు తమిళనాడులో లేకపోవడం గమనార్హం. ఇప్పుడు రజినీ ఎంట్రీతో ఆ లోటు తీరే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
మంచే జరుగుతుంది
రజినీ రాజకీయ ప్రవేశం ప్రకటనను సినీ రాజకీయ ప్రముఖులు స్వాగిస్తూనే ఉన్నారు. రజినీకాంత్ తమిళ రాజకీయాల్లోకి రావడం వల్ల అక్కడి ప్రజలకు మంచే జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.