రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ: ఇప్పుడు అవసరమా? కుటుంబ సభ్యుల ఆందోళన, ఒత్తిడి!
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశం ఆయన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదా? ఇప్పటికే ఆరోగ్యం సరిగా లేదు.. ఇప్పుడు రాజకీయాలు అవసరమా అంటూ వారు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారా?
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సస్సెన్స్ కొనసాగుతూనే ఉంది. ఆయన రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానుల ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. మరి ఆయన కుటుంబ సభ్యుల మనోగతం ఏమిటి? అసలు ఆయన రాజకీయాల్లోకి రావడం వారికి ఇష్టమేనా?
ఓ వైపు రజకీ కొత్త పార్టీ పెడతారని ఆయన సోదరుడు ఇప్పటికే ప్రకటించినప్పటికీ... రజనీ నుంచి మాత్రం ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. తన అభిమానులతో ఇప్పటికే పలు దఫాలు సమావేశమైన రజనీకాంత్ ఇంత వరకు స్పష్టమైన ప్రకటన మాత్రం చేయలేదు. దీనికి కారణమేమిటి?
కుటుంబ సభ్యులకు ఇష్టం లేదా?
కోట్లాది మంది అభిమానులు తలైవా అంటూ ముద్దుగా పిలుచుకునే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోమారు అమెరికా వెళ్లనున్నారు. తన ఆరోగ్య వైద్య పరీక్షల కోసం ఈ జూలైలో అమెరికాకు వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ ఒక్క వార్తతో ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై మళ్లీ చర్చ మొదలైంది. ఆరోగ్యం ఏమాత్రం సహకరించకుంటే రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, రజనీ రాజకీయ అరంగేట్రంపై మరో ఆసక్తికర కథనం వినిపిస్తోంది. రజనీ రాజకీయాల్లోకి రావడం ఆయన కుటుంబీకులకు ఏ మాత్రం ఇష్టం లేదట. వారి ఆందోళన అంతా ఆయన ఆరోగ్యం గురించేనట.
ఆరోగ్యం అంతంత మాత్రమేనా?
నిజానికి 2011లో రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆ సమయంలో తొలుత చెన్నైలో చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత సింగపూర్కు వెళ్లి అక్కడ ఉన్న ప్రఖ్యాత మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చేరి కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నారు. అనంతరం సంపూర్ణ ఆరోగ్యంతో స్వదేశానికి తిరిగివచ్చారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి కొద్దిరోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వినిపించగా, వాటిని కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. అయితే కిడ్నీ ఆపరేషన్ అనంతరం ఆయన ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉందని, ఇలాంటి పరిస్థితిలో రాజకీయాల్లోకి వస్తే ఆయన ఇంకా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారట. రాజకీయాలు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వారు మథనపడుతున్నారట.
రజనీ ఇప్పుడేం చేస్తున్నారు?
రజనీకాంత్ ప్రస్తుతం "2.0" చిత్ర షూటింగ్స్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆయన మళ్లీ అనారోగ్యానికి గురైనట్టు సమాచారం. ఫలితంగా మళ్లీ అమెరికా వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "కాలా" చిత్ర షూటింగ్లో కూడా రజనీకాంత్ పాల్గొంటున్నారు. ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఆయన ఉన్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 10 నుండి చెన్నైలో సెకండ్ షెడ్యూల్ జరుపుకోనుందట. ఇలా ఒకవైపు రెండు చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉంటూనే మరో వైపు తన రాజకీయ ప్రవేశంపై సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయన బర్త్డే డిసెంబర్ 12. ఆ రోజునే ఆయన స్థాపించబోయే రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుందని సమాచారం.
హెల్త్ చెకప్ తరువాతే స్పష్టత...
అయితే ఈ గ్యాప్లో తన రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం వారం రోజుల పాటు రజనీకాంత్ అమెరికా వెళ్ళనున్నారనే వార్త కోలీవుడ్లో హల్చల్ చేస్తోంది. అక్కడ వైద్యులు ఇచ్చే సలహానుబట్టి ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందుకే, ఆయన కుటుంబ సభ్యులు ఆరోగ్యం ఇలా ఉన్న పరిస్థితుల్లో మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లవద్దని రజనీని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే, రజనీ చిన్న కుమార్తె సౌందర్య మాత్రం తన తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నా తాను పూర్తిగా మద్దతు పలుకుతానని పేర్కొనడం విశేషం.