నోట్లు రద్దు, జీఎస్ టీ కారణంగా వ్యాపారంలో నష్టం: సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య, హై కోర్టులో!
చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ తాము నిర్వహిస్తున్న ట్రావెల్ ఏజెన్సీ కార్యాలయం అద్దె భారీ మొత్తంలో పెంచారని, ఈ విషయంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ చెన్నై నగరంలో పలు విధ్యాసంస్థలు, సేవా సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని అల్వార్ పేట్ లోని సీపీ. రామస్వామి రోడ్డులోని కార్పొరేషన్ కట్టడంలో లతా రజనీకాంత్ ట్రావెల్ ఏజెన్సీ కార్యాలయం నిర్వహిస్తున్నారు.
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు ఇటీవల లతా రజనీకాంత్ కు చెందిన ట్రావెల్ ఏజెన్నీ కార్యాలయం అద్దెను రూ. 3,702 నుంచి రూ.21,160 పెంచారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ లతా రజనీకాంత్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
లతా రజనీకాంత్ మద్రాసు హైకోర్టులో సమర్పించిన పిటిషన్ లోని వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్ టీ కారణంగా తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతినిందని, దానికి తోడు ఆన్ లైన్ లో వ్యాపారం ఎక్కువ అయ్యిందని, అందువలన మాకు నష్టాలు వచ్చాయని వివరించారు.
ఏదో అతి కష్టం మీద ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వహిస్తున్నామని, ఇలాంటి సమయంలో గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు మా కార్యాలయం అద్దెను రూ. 3,702 నుంచి ఒక్కసారిగా రూ. 21,160 పెంచారని, నిపుణుల కమిటీ వెయ్యకుండానే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని లతా రజనీకాంత్ మోహన్ మెమన్ అనే వ్యక్తి ద్వారా మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. ఇదే సమయంలో కార్పొరేషన్ అధికారులు కాంప్లెక్స్ ను సక్రమంగా నిర్వహించడంలేదని ఆరోపించారు.