నాకు కాషాయం రంగు పులమాలని చూశారు: బీజేపీపై రజినీ ఫైర్
Recommended Video
చెన్నై: తనకు కాషాయం రంగు అంటించేందుకు బీజేపీ విశ్వప్రయత్నం చేసిందని చెప్పారు తమిళ సూపర్స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ బీజేపీలో చేరతారనే వార్త షికారు చేస్తున్ననేపథ్యంలో రజనీకాంత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రజనీకాంత్కు కాషాయం కండువా కప్పాలని ప్రయత్నించారని అయితే తాను మాత్రం దానికి దూరంగానే ఉంటానని చెబుతూ బీజేపీతో కలిసేదిలేదనే సంకేతాలను పంపారు.
తమిళ కవి తిరువల్లువర్కు ఎలాగైతే కాషాయం రంగు పులిమారో తనను కూడా బీజేపీతో ముడి పెట్టే ప్రయత్నం మీడియా చేసిందని మండిపడ్డారు రజినీకాంత్. ఈ మధ్యే తిరువల్లువర్ జయంతి సందర్భంగా తమిళనాడు బీజేపీ కాషాయ రంగుతో ఉన్న ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేసిన విషయాన్ని రజినీకాంత్ గుర్తు చేశారు. సాధారణంగా తిరువల్లువర్ ఎప్పుడు తెల్లని శాలువా ధరించి కనిపిస్తారని చెప్పారు. తిరువల్లువర్కు కాషాయరంగు పులమడంతో రాజకీయంగా వివాదరం తలెత్తింది. ద్రవిడ పార్టీలు బీజేపీపై దుమ్మెత్తి పోశాయి.
తిరువల్లువర్కు మతం, కులంతో సంబంధం లేదని రజినీకాంత్ తెలిపారు. బీజేపీ తిరువల్లువర్కు కూడా రాజకీయరంగు పులమడాన్ని సూపర్స్టార్ తప్పుబట్టారు. తిరువల్లువర్ అంటే తమిళులకు ప్రాణమని చెప్పిన రజినీకాంత్ ఆయన దేవుడిని ప్రగాఢంగా నమ్ముతారని చెప్పుకొచ్చారు. ప్రజల సమస్యలను మరిచి తిరువల్లువర్ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని రజినీకాంత్ అభిప్రాయపడ్డారు.
ఇక తన రాజకీయ పార్టీ రజినీ మక్కల్ మండ్రం గురించి మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో కూడా తన పార్టీ పోటీచేయదని స్పష్టం చేశారు. తన సొంత రాజకీయ పార్టీ ప్రారంభించే వరకు తను నటిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు కబాలి. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేవరకు ఎంజీఆర్ నటిస్తూనే ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు రజినీకాంత్. రజినీ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు స్పందించారు. రజినీకాంత్ను తమ పార్టీలో చేరారని, లేదా చేరతారని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఇలాంటి వార్తలను బీజేపీ పట్టించుకోదని ప్రస్తుతం తాము స్థానిక ఎన్నికలపైనే దృష్టి సారించామని వెల్లడించారు.