తమిళ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా రజినీకాంత్!
చెన్నై: తమిళనాడులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ముందే ప్రముఖ నటుడు రజనీకాంత్ పేరు వినిపిస్తుంది. ఆయన ఏ పార్టీలోనైనా చేరతారా? లేక సొంతంగానే పార్టీ పెట్టి రాజకీయ అరంగేట్రం చేస్తారా? అనే వార్తలు రేకెత్తుతాయి. లేదంటే ఆయన ఏ పార్టీకైనా మద్దతు తెలుపుతారా? అనేది చర్చనీయాంశంగా మారుతుంది.
అయితే, రజనీ రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారా? అని ఆయన అభిమానులు ఇప్పటికీ ఆశగా చూస్తూనే ఉన్నారు. రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి చూపని రజనీ మాత్రం ఇంతవరకు ఏ ఎన్నికలు జరిగినా మౌనంగా ఉన్నారు.
గతంలో ఒకసారి ఎన్నికల పొత్తు విషయంలో చక్రం తిప్పి ఆ కూటమికి విజయాన్ని ఆపాదించిడంతో.. రజనీకాంత్ ఆపై రాజకీయాల్లోకి రావడం తథ్యం అన్న భావన చాలా మందిలో కలిగింది. అయితే అలాంటి ఊహలను తారుమారు చేస్తూ నేటికీ రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.
రజనీకాంత్ ఇప్పుడు మరోసారి రాజకీయ వార్తలకు కేంద్రబిందువుగా మారారు. ఆ మధ్య బిజెపి.. రజనీకాంత్కు గాలం వేస్తోందనే ప్రచారం హోరెత్తింది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీనే స్వయంగా సూపర్స్టార్ రజనీని కలవడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది.
అయితే అప్పుడు రజనీ.. మోడీకి శుభాకాంక్షలు మాత్రమే చెప్పి మద్దతు తెలపకుండా అందర్నీ ఆశ్చర్యపరచారు. కాగా ఇటీవల చిత్రరంగానికి రజనీ చేసిన సేవకు గానూ కేంద్రప్రభుత్వం రజనీకి పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదీ రాజకీయ ఎత్తుగడలో భాగమేనని ఒక వర్గం భావిస్తోంది.
కాగా, తాజాగా తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో రజనీకాంత్ పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం రెండు చిత్రాల షూటింగ్లతో బిజీగా ఉన్న సూపర్స్టార్ అందులో ఒక చిత్రం కబాలి షూటింగ్ను మలేషియాలో పూర్తి చేసి సోమవారం రాత్రికి చెన్నైకి చేరుకున్నారు.
చెన్నై విమానాశ్రయంలో మీడియా వేసిన పలు ప్రశ్నలకు రజిని సమాధానం దాటవేయడం గమనార్హం. ముఖ్యంగా రాజకీయపరమైన ప్రశ్నలకు బదులివ్వడానికి విముఖత వ్యక్తం చేశారు.
అయితే, రజిని మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించడం సంతోషమే. అందుకు కేంద్రప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ అవార్డు నాకు ఆలస్యంగా లభిస్తోందని భావించడం లేదు. అదే విధంగా అవార్డు విషయంలో కేంద్రప్రభుత్వం తమిళులపై సవతి ప్రేమ చూపుతోందని అనుకోవడంలేదు' అని పేర్కొన్నారు.
కాగా, రానున్న శాసన సభ ఎన్నికల గురించి వ్యాఖ్యానించమన్న ప్రశ్నకు మాత్రం సూపర్ స్టార్ రజనీ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. మోడీతో మంచి సంబంధాలున్న రజినీని ఎన్నికల్లో బిజెపి మద్దతు పలికేలా చేయాలని రాష్ట్ర బిజెపి నేతలు చాలా కాలం నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రజిని నుంచి మాత్రం సానుకూలంగా లేదా వ్యతిరేకంగా గానీ ఎలాంటి స్పందనా రాలేదు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.