జమిలి మంచి ఆలోచన, మద్దతివ్వాలి, పోటీపై తర్వాత నిర్ణయం: రజనీకాంత్
చెన్నై: జమిలి ఎన్నికలను సూపర్ స్టార్ రజనీకాంత్ స్వాగతించారు. వన్ నేషన్ వన్ పోల్ (ఒకేసారి ఎన్నికలు) చాలా మంచి ఆలోచన అని చెప్పారు. డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయని అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తమిళనాడుకు చెందిన పలు పార్టీలు జమిలి ఎన్నికలను వ్యతిరేకించాయి. అన్నాడీఎంకే జమిలికి అంగీకరించినప్పటికీ ఇప్పుడు కాదని, 2024 నుంచి నిర్వహించాలని చెప్పింది. ఇప్పుడు దీనిపై రజనీకాంత్ స్పందించారు. ఆయన ఆదివారం చెన్నైలో మీడియాతో మాట్లాడారు.
సార్వత్రిక ఎన్నికల్లో తాము పోటీ చేసే అంశంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని రజనీ అంతకుముందు చెప్పారు. ఎన్నికలకు చాలా సమయం ఉందన్నారు.
తమిళనాడులో పెద్ద ఎత్తున అవినీతి కనబడుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆరోపించారని, దీనిపై ఏమంటారని మీడియా ప్రశ్నించగా.. అది అమిత్ షా అభిప్రాయమని, ఆయననే అడగాలని చెప్పారు. కాగా, జమిలిపై రజనీకాంత్ ప్రకటన బీజేపీకి మంచి ఊరట అని చెప్పవచ్చు.