అత్తి వరదార్ సేవలో తలైవా: ఇక ఆయన దర్శనం 2059లోనే..అప్పటిదాకా కోనేట్లోనే
చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కాంచీపురంలోని అత్తి వరదరాజుల స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. తన భార్య లతతో కలిసి మంగళవారం రాత్రి కాంచీపురానికి చేరుకున్నారు. బుధవారం తెల్లవారు జామున రజినీకాంత్ దంపతులు అత్తి వరదార్ స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా రెండురోజుల కిందట అత్తి వరదరాజుల స్వామివారిని దర్శించిన విషయం తెలిసిందే.
నిన్న జనసేన..నేడు టీడీపీ: వేదాయపాలెం పోలీస్ స్టేషన్ ముట్టడి!
ఇక స్వామి దర్శనం 2059లోనే .
కాంచీపురం విష్ణుకంచిలోని వరదరాజుల స్వామి ఆలయంలో అత్తి వరదరాజుల వారి విగ్రహాన్ని సందర్శనకు ఉంచారు. ఈ విగ్రహం మరో నాలుగు రోజుల పాటు మాత్రమే భక్తుల సందర్శన కోసం అందుబాటులో ఉంటుంది. ఈ నెల 18వ తేదీన విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోని కోనేరులో భద్రపరుస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఆరంభం అయ్యాయి. 40 సంవత్సరాల పాటు అత్తి వరదరాజుల వారి విగ్రహాన్ని అందులోనే ఉంచుతారు. మళ్లీ 2059లోనే వెలికి తీస్తారు. 48 రోజుల పాటు భక్తుల సందర్శన కోసం ఉంచిన తరువాత 40 సంవత్సరాల పాటు కోనేట్లోనే భద్రపరుస్తారు. కొన్ని శతాబ్దాలుగా ఇది ఆలయ సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. 1979 తరువాత స్వామి వారి విగ్రహాన్ని వెలికి తీయడం ఇదే తొలిసారి.
పోటెత్తుతున్న భక్తులు
అత్తి వరదార్ ను దర్శించడం రజినీకాంత్ కు ఇది రెండోసారి. వారం రోజుల కిందట ఆయన ఒంటరిగా వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్లారు. తాజాగా భార్య లతతో కలిసి వచ్చారు. స్వామి వారిని కోనేట్లోకి చేర్చే సమయం ఆసన్నమైనందున.. భక్తుల తాకిడి అధికమైంది. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శనానికి వస్తున్నారు. విదేశీ భక్తులు సైతం పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. విదేశాల్లో స్థిరపడిన తమిళ భక్తులు స్వామివారి దర్శనం కోసం కాంచీపురానికి చేరుకుంటున్నారు.
జీవితంలో ఒక్కసారి మాత్రమే స్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంటుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. 2059 నాటికి జీవించే ఉండే అవకాశం లేనందున వ్యయ, ప్రయాసలకు ఓర్చి స్వామి వారి దర్శనం కోసం వస్తున్నామని భక్తులు చెబుతున్నారు.