డియర్ సీఎం, మీ గురించి దేవుడిని ప్రార్థిస్తున్నా: ట్విట్టర్లో రజనీకాంత్
చెన్నై: తీవ్రజ్వరం, డీహైడ్రేషన్తో బాధపడుతూ చెన్నై గ్రీమ్స్ రోడ్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆకాంక్షించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "డియర్ సీఎం మీరు త్వరగా ఉపశమనం పొందాలని దేవుడిని ప్రార్థిస్తున్నా" అని అందులో పేర్కొన్నారు.
அன்புள்ள CM அவர்கள் விரைவில் நலமடைய இறைவனை பிராத்திக்கிறேன்
— Rajinikanth (@superstarrajini) September 24, 2016
కాగా, సీఎం జయలలిత శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే, ఆమెను అపోలో ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ఇక ఆమె త్వరగా కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం జయలలితను మెరుగైన చికిత్స కోసం సింగపూర్కు తరలిస్తున్నారు.
ఆమెకు మధుమేహం ఎక్కువ స్థాయిలో ఉండటం, దానికి తోడు కిడ్నీ సంబంధిత సమస్య కూడా ఉండటంతో చికిత్స కోసం ఆమెను సింగపూర్ పంపుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమెకు జ్వరం తగ్గింది గానీ కోలుకులేదని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వైద్యులు తెలిపారు.
బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా జయలలితను మెరుగైన వైద్యం కోసం సింగపూర్ ఆసుపత్రికి తరలించాలని ట్విట్టర్లో సూచించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ్వరం తగ్గడంతో ఆమెకు సాధారణ ఆహారాన్నే ఇస్తున్నట్లు అపోలో ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ వెల్లడించారు.
ఇక జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెకు బొకే పంపారు. అందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ ఓ లేఖ రాశారు. సీఎం అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కావడం ఆందోళనకరంగా ఉందని, ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు.
🙏🏻 wishing you a speedy recovery respected CM madam https://t.co/9WuNuVDrlP
— soundarya rajnikanth (@soundaryaarajni) September 24, 2016