లోక్ సభ ఎన్నికలుః సూపర్స్టార్ షాకింగ్ డెసిషన్, ఆ పార్టీకి మద్దతా?
చెన్నైః దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇలాంటి ప్రకటన ఒకటి ఆయన చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. వచ్చే లోక్ సభ ఎన్నికలకు తాను దూరంగా ఉండబోతున్నట్లు రజినీకాంత్ ప్రకటించారు. తాను గానీ, తన పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన చెన్నైలో ఓ ప్రకటన విడుదల చేశారు. ఉరుము లేని పిడుగులాగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఆయన నుంచి ఈ ప్రకటన వస్తుందని అభిమానులు ఏ మాత్రం ఊహించలేదు. కేంద్రంలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం కోసమే రజినీకాంత్ లోక్ సభ ఎన్నికలకు దూరం అయ్యారనే సమాచారం. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వానికి ఏర్పాటు చేసే పార్టీకి ఓటు వేయాలని ఆయన పిలుపునివ్వడం దీనికి నిదర్శనమని అంటున్నారు.
తాను ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నట్లు ఏడాదిన్నర కిందటే ప్రకటించారు రజినీకాంత్. దీనికోసం ఆయన రజినీ మక్కళ్ మండ్రమ్ పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి గుర్తింపు కూడా ఉంది. రజినీ పార్టీ పెట్టడంతో తమిళ చిత్ర పరిశ్రమ ఆయన వైపు నిలిచింది. పలువురు నటులు, దర్శకులు, టెక్నీషియన్లు రజినీకాంత్ను స్వయంగా కలిసి, అభినందనలు తెలియజేశారు. అన్ని రకాలుగా పార్టీకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
నా బొమ్మ వాడొద్దు..
మరో రెండు నెలల్లో లోక్ సభ ఎన్నికలకు రజినీ మక్కళ్ మండ్రమ్ సమాయాత్తమౌతోందని అందరూ భావించారు. రజినీకాంత్ పార్టీ పెట్టిన తరువాత ఎదుర్కోబోయే అతి పెద్ద ఎన్నికలు అవే కావడంతో.. అభిమానులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని కూడా చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో హఠాత్తుగా రజినీకాంత్ చేసిన ప్రకటన అనేక అనుమానాలకు తావిచ్చింది. తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. తన ఫొటోలు గానీ, పార్టీ పేరు గానీ, పార్టీ గుర్తు గానీ ఎవ్వరూ లోక్ సభ ఎన్నికల్లో ఉపయోగించకూడదని విజ్ఞప్తి చేశారు.
తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు.. లోక్ సభ ఎన్నికల్లో ఆచితూచి ఓటు వేయాలని సూచించారు. తమిళనాడు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే పార్టీకి మాత్రమే ఓటు వేయాలని రజినీకాంత్ చెప్పారు. ఫలానా పార్టీ అంటూ తాను దేన్నీ సూచించబోనని అన్నారు. తన రాష్ట్రం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య నీటిదేనని, దాన్ని పరిష్కరించడానికి కృషి చేసే పార్టీని గెలిపించుకోవాలని చెప్పారు. కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాలని అన్నారు. సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రజినీ అన్నారు.
తమిళనాడులో నీటి ఎద్దడి..
రజినీకాంత్ చెప్పినట్టు తమిళనాడులో జలగండం ఉంది. సాగునీటి పరిస్థితి అలా వుంచితే, కనీసం తాగడానికి కూడా మంచినీరు దొరకని పరిస్థితి తమిళనాడులో ఏటా వేసవిలో ఏర్పడుతుంది. వేసవిలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళణిస్వామి ఇప్పటికే 158 కోట్ల రూపాయలను విడుదల చేశారు.
సుస్థిర ప్రభుత్వం పేరుతో కమలానికి దగ్గర? డీఎంకేకు విఘాతమే!
ఇదిలావుండగా, రజినీకాంత్ తాజాగా చేసిన ప్రకటన రాజకీయ విశ్లేషకుల బుర్రలకు పని పెట్టినట్టయింది. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం కోసమే ఆయన పోటీ నుంచి తప్పుకొన్నారనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. పళణిస్వామి నేతృత్వంలోని అన్నా డీఎంకే.. కొద్దిరోజులుగా క్రమంగా బీజేపీకి దగ్గరవుతోంది. లోక సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా ఉండొచ్చంటూ వార్తలు వచ్చాయి. ఎన్నికలంటూ జరిగితే.. ఇప్పుడున్న అన్నా డీఎంకే పార్టీకి పెద్దగా సీట్లు వచ్చే అవకాశాలు తక్కువే అనే అభిప్రాయం ఉంది. అదే జరిగితే- అన్నా డీఎంకే గట్టి పోటీ ఇచ్చే డీఎంకే లబ్ది పొందడం ఖాయం అవుతుంది.
డీఎంకేతో సుస్థిర ప్రభుత్వం అసాధ్యమా?
డీఎంకే ప్రభుత్వానికి అధిక సీట్లు గనక వస్తే, యూపీఏ ప్రభుత్వం లాభపడుతుంది. ఎందుకంటే- డీఎంకే అధినేత స్టాలిన్ ఇదివరకే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో చురుగ్గా పాల్గొంటున్నారు. యూపీఏ ప్రభుత్వమే ఏర్పాటైతే, సుస్థిర ప్రభుత్వం అందించలేదని రజినీకాంత్ అభిప్రాయపడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. తానే స్వయంగా బీజేపీకి మద్దతు ఇస్తే, తాను పెట్టిన రాజకీయ పార్టీకి మనుగడ గానీ, ఉనికి గానీ ఉండదని రజినీ భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాను ఎన్నికల నుంచి తప్పుకోవడం వల్ల బీజేపీకి లేదా, ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడిన అన్నా డీఎంకేకు లబ్ది కలిగించేలా వ్యవహరించాలనేది రజినీకాంత్ వ్యూహంగా చెబుతున్నారు.
వాటన్నింటినీతో పాటు మొన్నటి అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బాగా నష్టపోవడం కూడా రజినీకాంత్ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకో్వడానికి ఓ కారణమై ఉంటుందనే అంచనా వేస్తున్నారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. అదే ప్రభావం లోక్ సభ ఎన్నికలపై పడితే ఎన్డీఏ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. బొటాబొటి సీట్లు వస్తే, మరొకరి మీద ఆధాపడాల్సి ఉంటుంది. దానివల్ల సుస్థిర ప్రభుత్వానికి అవకాశం ఉండదు. ఆయా అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే రజినీకాంత్ ఎన్నికలకు దూరం అయ్యారని తెలుస్తోంది.