రజినీకాంత్ ఎంట్రీ త్వరలోనే!: ప్రశాంత్ కిషోర్తో కీలక భేటీ, ఇక ముందుకే
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించి దాదాపు ఏడాది గడిచిపోయినా తన పార్టీ పేరు, విధి విధానాలపై ఆయన ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రస్తుతానికైతే చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేస్తూ బిజీగా గడుపుతున్నారు.
అభిమానులతో సమావేశం
గతంలో రజినీకాంత్ తాను తమిళ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. సమయం వచ్చినప్పుడు పార్టీని ప్రకటిస్తానని వెల్లడించారు. అంతేగాక, అభిమానులతో భారీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పుడే రాజకీయ పార్టీని ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ అలా జరగలేదు. కానీ, రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడాన్ని ఆయన అభిమానులు స్వాగతించి మద్దతు పలికారు.
అభిమానులకు ఎదురుచూపులు..
ఇప్పటికే ప్రముఖ తమిళ సినీ నటుడు కమల్ హాసన్ తన రాజకీయ పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. తమిళనాడులో తన అభిమానులతో సమావేశాలు కూడా నిర్వహించారు. రజినీకాంత్ కూడా పార్టీ పేరును ప్రకటిస్తారని ఆశించిన ఆయన అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది. ఆయన ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో అభిమానులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
టార్గెట్గా మారిన రజినీ
రాజకీయాల్లోకి వస్తానంటూ రజినీకాంత్ ప్రకటించడంతోనే తమిళ రాజకీయ పార్టీలు ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు కూడా చేశాయి. రజినీకాంత్ అసలు తమిళుడే కాదంటూ.. ఆయనను ఎలా గెలిపించుకుంటామంటూ పలువురు రాజకీయ నాయకులు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు.
ఇతర పార్టీలకు నష్టం తప్పదు
అయితే, రజినీకాంత్కు తమిళనాడులో లక్షలాది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన రాజకీయ పార్టీ పెట్టారంటే ఇతర రాజకీయ పార్టీలకు నష్టం జరగక తప్పదు. దీంతో రజినీని లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టాయి. అయితే, తాజాగా చోటు చేసుకున్న పరిణామం మరోసారి రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై చర్చకు దారితీసింది.
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్తో రజినీ భేటీ..
ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్తో రజినీకాంత్ సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ పార్టీ ప్రకటన, విధి విధానాలు, ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే భారీ బహిరంగ సభ పెట్టి రాజకీయ పార్టీపై రజినీకాంత్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రశాంత్ ఇప్పటికే పలు దేశంలోనూ, పలు రాష్ట్రాల్లోనూ పార్టీలతో పనిచేసి ఆ పార్టీలను గెలుపు దిశగా నడిపించిన విషయం తెలిసిందే. రజినీకాంత్ను కూడా ప్రశాంత్ విజేతగా నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో రజినీ రాజకీయ పార్టీపై ముందడుగు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.