రాజీవ్ హత్య: దోషులను రిలీజ్ చేస్తామన్న జయలలిత
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న ముగ్గురు దోషులను తమిళనాడు ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించింది. మిగితా వారిని కేంద్రాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. జీవిత ఖైదు అనుభవిస్తున్న పెరారీవాలన్, మురుగన్, శాంతన్లను విడుదల చేయాలని తమిళనాడు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
రాజీవ్ హత్య కేసులో మరో నలుగురు దోషులైన నళిని, రాబర్ట్ ప్యాస్, జయకుమార్, రవిచంద్రన్ కూడా జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. వీరిపై కేంద్రంతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రివర్గం ప్రకటించింది. మూడు రోజుల్లోగా కేంద్రం ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించకపోతే.. భారత రాజ్యాంగం ప్రకారం నిందితులందర్నీ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి జయలలిత స్పష్టం చేశారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శాసనసభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. హంతకులను విడుదల చేయాలని నిర్ణయించడం సరైన చర్య కాదని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎన్ఆర్ రంగరాజన్ అన్నారు. అయితే ఏదైనా కేసులో ఎవరైతే 14 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించి ఉంటారో, ఆ సమయంలో వారి సత్ప్రవర్తనను పరిగణలోకి తీసుకుని వారిని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది.