రాజీవ్ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం - 29 ఏళ్లలో తొలిసారి- వేలూరు జైల్లో కలకలం..
1991లో మానవ బాంబు పేల్చి మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీని పొట్టనబెట్టుకున్న ప్రధాన నిందితురాలు నళినీ శ్రీహరన్ అప్పటి నుంచి తమిళనాడులోని వేలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా నిన్న రాత్రి ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో ఆమెను జైలు అధికారులు కాపాడి ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఆమె ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు.
రాజీవ్ హత్యలో దోషిగా నిర్ధారణ అయిన తర్వాత నుంచీ వేలూరు జైల్లోనే శిక్ష అనుభవిస్తున్న నళిని నిన్న రాత్రి మాత్రం తోటి ఖైదీతో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని జైలు అధికారులు చెబుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని కూడా వారు పేర్కొన్నారు. 29 ఏళ్లుగా ఇదే జైల్లో ఉంటున్న నళిని ఎవరితో గొడవ పడిన సందర్భాలూ లేవు. తనను శిక్ష నుంచి విముక్తి కల్పించాలని మాత్రం పలుమార్లు ప్రభుత్వాలకు, కోర్టులకు ఆమె అర్జీలు పెట్టుకున్నారు. కానీ ఆమెకు విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మాత్రమే మార్చారు. తాజాగా ఆమె కూతురు పెళ్లి కోసం ఆరు నెలలు పెరోల్ పై బయటికి వెళ్లి తిరిగి వచ్చింది. ఆ తర్వాత తండ్రి శంకర్ నారాయణన్ చనిపోవడంతో అంత్యక్రియల కోసం మరోసారి పెరోల్ పై వెళ్లి వచ్చింది.
రాజీవ్ హత్య కేసులోనే ఇదే వేలూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆమె భర్త మురుగన్ తాజాగా నళిని ఆత్మహత్యాయత్నంపై ఆందోళన వ్యక్తం చేశారు. తోటి ఖైదీతో ఘర్షణ నేపథ్యంలో ఆమెను మరో జైలుకు మార్చాలని మురుగన్ కోరుతున్నారు. రాజీవ్ హత్య కేసులో నళిని, మురుగన్ తో పాటు మొత్తం ఏడుగురు వేలూలు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.