రాజీవ్గాంధీ హత్య: ముందస్తు రిలీజ్కు నళిని పెట్టుకొన్న పిటిషన్ కొట్టివేత
చెన్నై: మాజీ ప్రధానమంత్రి రాజీవ్గాంధీ హత్య కేసులో దోషిగా జైలులో శిక్షను అనుభవిస్తున్న నళిని శ్రీహరన్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. నిర్ణీత సమయం కంటే ముందుగానే విడుదల చేయాలని ఆమె పెట్టుకొన్న పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది.
1994లో తమిళనాడు ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పథకం కింద తనను విడుదల చేయాలంటూ నళిని హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే సింగిల్ జడ్జి బెంచ్ ఆమె పిటిషన్ను కొట్టివేశారు. దీన్ని సవాల్ చేస్తూ నళిని రెండ్రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన జస్టిస్ కేకే శశిధరణ్, ఆర్ సుబ్రహ్మణియన్ ధర్మాసనం ఈ తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు. ఆమె పిటిషన్ను తిరస్కరిస్తున్నట్టు ఇవాళ ప్రకటించారు. ఇదే కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున తాము నిర్ణయం తీసుకోమని కోర్టు స్పష్టం చేసింది.
ఆర్టికల్ 161 (గవర్నర్కు క్షమాభిక్ష ప్రసాదించే అధికారం) కింద తమిళనాడు ప్రభుత్వం 1994లో తీసుకొచ్చిన పథకం ప్రకారం.. 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన వారిని విడుదల చేస్తారు. దీంతో దాదాపు 25 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని తనను ముందస్తుగా విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.
ఆమెను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో దీన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజీవ్ హత్య కేసు నిందితులను విడుదల చేయరాదంటూ సుప్రీకోర్టు ఆదేశించడంతో నళిని విడుదల ఆగిపోయింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది.
1991 మే 21న శ్రీపెరుంబదూర్ వద్ద ఓ సూసైడ్ బాంబర్ దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు. ఈ కేసులో మురుగన్, శాంతన్, పెరారివాలన్, నళిని, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్ సహా ఏడుగురు దోషులుగా ఉన్నారు.
పయాస్, జయకుమార్లకు మరణశిక్ష విధించినప్పటికీ.. 1999లో సుప్రీంకోర్టు వీరి ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. నళినికి కూడా తొలుత మరణ శిక్ష పడింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని ధ్రువీకరించినప్పటికీ.. ఆర్టికల్ 161 కింద తమిళనాడు ప్రభుత్వం ఆమె శిక్షను జీవిత ఖైదుగా మార్చింది.