సుప్రీంకోర్టుకు రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులు..!
చెన్నై : శాశ్వత బెయిల్ కోరేందుకు సిద్ధమయ్యారు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులు. ఈమేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. రాజీవ్ హత్యకేసులో నళిని, శంకరన్, పేరివవాలన్, మురుగన్ సహా ఏడుగురు నిందితులు వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈకేసులో వారి తరపున వాదిస్తున్న లాయర్ వేలూరు జైలుకెళ్లి మాట్లాడిన సందర్భంలో శాశ్వత బెయిల్ గురించి వెల్లడించారు. రాజీవ్ హత్య కేసు నిందితులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించినా.. గవర్నర్ ఇంతవరకు స్పందించలేదన్నారు లాయర్. అందుకే వీరికి పర్మనెంట్ బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.
అదలావుంటే 2014లో తనను జైలు నుంచి విడుదల చేయాలంటూ నళిని పెట్టుకున్న పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. రాజీవ్ హత్య కేసులో ఏళ్లకొద్దీ జైలుశిక్ష అనుభవించానని.. ఇప్పటికైనా రిలీజ్ చేయాలని దాఖలు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. అదే ఏడాది ఫిబ్రవరిలో నళినికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది సుప్రీంకోర్టు. అనంతరం క్రిమినల్ ప్రొసిజర్ చట్టం అనుసరించి.. శిక్ష కాలానికంటే ముందుగానే నిందితులను విడుదల చేయాలనుకుంటున్నట్లుగా జయలలిత ప్రభుత్వం ప్రకటించింది. అయితే యూపీఏ సర్కార్ సుప్రీంను ఆశ్రయించడంతో స్టే విధించింది.