రాజీవ్ గాంధీ సొంత పర్యటన కోసం ఎప్పుడూ యుద్ధ నౌక వాడలేదు: మాజీ ఉన్నతాధికారి
న్యూఢిల్లీ: భారత దేశానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్ను మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తన కుటుంబంతో కలిసి హాలిడేస్ కోసం వినియోగించుకున్నారని ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై లక్ష్వద్వీప్ మాజీ ఐఏఎస్ అధికారి వజాహత్ హబీబుల్లా స్పందించారు. ఐఎన్ఎస్ విరాట్ లక్ష్వద్వీప్లోనే ఉన్నప్పటికీ అందులోకి తన కుటుంబంతో కలిసి అందులో రాజీవ్ గాంధీ ప్రయాణించలేదని స్పష్టం చేశారు.
రాజీవ్ గాంధీ ఐఎన్ఎస్ విరాట్లో తన కుటుంబ సభ్యులతో పాటు సమయం గడిపారన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై వజాహత్ హబీబుల్లా నాడు రాజీవ్ గాంధీ లక్షద్వీప్లో గడిపిన సమయాన్ని నెమరువేసుకున్నారు. రాజీవ్ గాంధీ సోనియాగాంధీలు నాడు ప్రభుత్వ హెలికాఫ్టర్లో లక్షద్వీప్లో ల్యాండ్ అయినట్లు గుర్తు చేశారు.ఆ సమయంలో ప్రధానికి భద్రత కల్పించే క్రమంలో సముద్రంలోనే ఐఎన్ఎస్ విరాట్ ఉండేదని తెలిపారు. సముద్రంలో ఉన్న సమయంలో సెక్యూరిటీ కల్పించాలంటే యుద్ధ నౌక తప్ప మరో ఛాయిస్ లేదని తెలిపారు.
రాజీవ్ గాంధీ తన అధికారిక సమావేశం కోసం లక్షద్వీప్కు వెళ్లారని అదేసమయంలో కొంతమంది అతిథులు రావడంతో అక్కడే ఉండాల్సి వచ్చిదని చెప్పారు. విదేశీయులు గానీ, ఇతర అతిథులు కానీ ఐఎన్ఎస్ విరాట్లోకి రాలేదని వెల్లడించారు.ప్రధాని నరేంద్ర మోడీ పొంతనలేని వ్యాఖ్యలు చేసి ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని ఈ విషయాన్ని ఎన్నికల సంఘంలోని అధికారులు పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇక రాజీవ్ గాంధీని ఆసమయంలో కలిసిన వారిలో అమితాబ్ బచ్చన్ కుటుంబం ఉన్నట్లు ఓ జాతీయ పత్రిక రాసిన కథనాన్ని ప్రధాని మోడీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఓర్యాలీలో మాట్లాడిన ప్రధాని ఐఎన్ఎస్ విరాట్ను 10 రోజుల పాటు ఓ ట్యాక్సీలా రాజీవ్ గాంధీ వినియోగించుకున్నారని ఆరోపించారు ప్రధాని మోడీ. తన కుటుంబంతో పాటు తన అత్త మామల కుటుంబాలు కూడా ఐఎన్ఎస్ విరాట్లో ఉన్నట్లు మోడీ అన్నారు. అంతేకాదు నేవీలో పనిచేసే జవాన్లు కూడా రాజీవ్ గాంధీ కుటుంబానికి సేవచేసేందుకు వినియోగించుకున్నారని తీవ్ర స్థాయిలో మోడీ ధ్వజమెత్తారు. గాంధీ కుటుంబం దేశభద్రతను గాలికొదిలేసిందని విమర్శించారు.