రాజీవ్ హంతకులకు ఊరట- తమిళనాడు గవర్నర్ క్షమాభిక్ష నిర్ణయం తీసుకోవచ్చన్న సుప్రీం
1991లో తమిళనాడులోని శ్రీపెరంబదూరులో జరిగిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా నిర్ధారణ అయిన వారికి క్షమాభిక్ష ప్రసాదించే ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే ఉంది. వీరికి తాము క్షమించేసినట్లు స్వయంగా రాజీవ్ కుటుంబ సభ్యులైన సోనియాగాంధీ, ఆమె ఇద్దరు పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పెద్ద మనసు చేసుకుని ఎప్పుడో ప్రకటించారు. అయితే చట్టం ముందు వీరు దోషులుగా నిరూపణ అయినందున వీరికి క్షమాభిక్ష మాత్రం ఇప్పటికీ లభించలేదు.
రాజీవ్ హత్యపై దర్యాప్తు జరుపుతున్న మల్టీ డిసిప్లినరీ మానిటరింగ్ ఏజెన్సీ (ఎండీఎంఏ) ఇంకా థాయిలాండ్, బ్రిటన్ నుంచి తమకు ఇంకా పలు ఆధారాలు అందాల్సి ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఇంకా అక్కడి నుంచి సమాచారం తెప్పించలేకపోవడమేంటని ఆక్షేపించింది. మరోవైపు ఎండీఎంఏ విచారణ జరుపుతున్న నేపథ్యంలో రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష ప్రకటించకుండా మద్రాసు హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజీవ్ హంతకుల్లో చాలా మంది ఇప్పటికే రెండు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించినందున ఎండీఎంఏ దర్యాప్తుతో సంబంధం లేకుండా వీరి క్షమాభిక్షపై తమిళనాడు గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది.
రాజీవ్ను బలిగొన్న బాంబు విదేశాల్లో తయారైనట్లు భావిస్తున్న ఎండీఎంఏ కొన్నేళ్లుగా ఆధారాల కోసం ప్రయత్నిస్తోంది. అవి ఇప్పటికీ దొరక్కపోవడంతో దోషులంతా క్షమాభిక్షకు దూరమై జైళ్లలోనే మగ్గుతున్నారు. ఇప్పటికే గవర్నర్ వద్ద దోషుల క్షమాభిక్ష పెండింగ్లో ఉన్నందున సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలిపింది. గవర్నర్నే తిరిగి ఆశ్రయించాలని దోషులకు సూచించింది. 2015లోనే క్షమాభిక్ష కోసం రాజీవ్ నిందితుల్లో ఒకరైన పెరరివాలన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను అప్పట్లో కేబినెట్ సిఫార్సు చేసినా ఇప్పటివరకూ గవర్నర్ పెండింగ్లోనే ఉంచారు. దీనిపై నవంబర్ 23 తర్వాత విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.