భారత్ చేతులు ముడుచుకోదు: రాజ్, ఎర్రచందనంపై కనిమొళి నిలదీత
న్యూఢిల్లీ: భారత దేశం ఎప్పుడు కూడా తనంతట తాను ఎవరినీ రెచ్చగొట్టదని, అదే సమయంలో ఎవరైనా అలాంటి దాడులకు పాల్పడితే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం చెప్పారు. సరిహద్దు వెంబడి జరిగే కాల్పులు, దాడులకు మన దళాలు దీటుగా సమాధానం ఇస్తాయన్నారు.
రాజ్నాథ్ సింగ్ బుధవారం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) గోల్డెన్ జూబ్లీ సెమినార్లో మాట్లాడారు. సరిహద్దులు సురక్షితంగా ఉంటే భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు. బీఎస్ఎప్ అద్భుతంగా పని చేస్తోందని, కేవలం సరిహద్దులే కాక గుజరాత్ వంటి తీర ప్రాంతాల్లో రక్షణ బాధ్యతలు నిర్వహిస్తోందన్నారు. అత్యాధునిక ఆయుధాలు అందజేస్తామన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ వెల్ఫేర్ కార్యక్రమాలను రాజ్ నాథ్ ప్రశంసించారు.
శేషాచలం ఎన్కౌంటర్పై సీబీఐ దర్యాప్తునకు నో
శేషాచలం ఎన్కౌంటర్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రానందున సీబీఐ దర్యాప్తునకు ఆదేశించలేమని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. శేషాచలం ఎన్కౌంటర్పై గురువారం నాడు రాజ్యసభలో జరిగిన చర్చ జరిగింది.
ఈ సందర్భంగా హోం మంత్రి పై విధంగా వ్యాఖ్యానించారు. ఎదురు కాల్పుల విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలున్నాయని, ఆ మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించిందన్నారు.
ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని పోలీసులు చెబుతున్నారని, ఘటన జరిగిన తీరు అనుమానాస్పదంగా ఉందని కనిమొళి అన్నారు. దుంగలు మోసుకెళ్లే కీలుల వద్ద ఆయుధాలు ఉంటాయా అని కనిమొళి ప్రశ్నించారు. ఎర్ర చందనం అక్రమ రవాణాలో బడాబాబులను పట్టుకోవాలని జైరాం రమేష్ విజ్ఞప్తి చేశారు. ఎర్ర చందనం పెద్ద మాఫియా అని, అక్రమ రవాణాతో వచ్చిన డబ్బులను రాజకీయాల్లో పెడుతున్నారని సీఎం రమేష్ అన్నారు.