చైనాకు తగిన గుణపాఠం చెప్పాల్సిందే: త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ భేటీ
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనా దుస్సాహసానికి పాల్పడితే తగిన విధంగా గుణపాఠం చెప్పాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాలకు స్పష్టం చేశారు. వాస్తవధీన రేఖ వెంబడి ఉద్రిక్తతల నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే, నావికాదళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్, వాయుసేనాధిపతి చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా పాల్గొన్నారు.
ఈ భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగింది. సరిహద్దులో భారత్ భిన్నమైన వ్యూహాత్మక విధానాల్ని అవలంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భూ సరిహద్దు, గగనతలం సహా వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో చైనా కార్యకలాపాలపై ఇకపై అత్యంత జాగరూకతతో వ్యవహరించాలని త్రివిధ దళాలను రాజ్నాథ్ ఆదేశించారు.
చైనా ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా వెంటనే తిప్పికొట్టేందుకు పూర్తి అధికారాలు ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే ఆర్మీ, వాయుసేనలు సరిహద్దుల వద్ద పెద్ద ఎత్తున మోహరిస్తున్నాయి. లఢక్లోని గల్వాన్ లోయలో భారత్-చైనా మధ్య జూన్ 15న తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
చైనా దొంగదెబ్బతీసి పాల్పడిన దాడిలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. భారత జవాన్ల ప్రతిదాడిలో 45మందికిపైగా డ్రాగన్ దళాలు హతమైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తదుపరి చర్యల గురించి చర్చించేందుకు రాజ్ నాథ్ త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు.