టైర్ల కింద నిమ్మకాయలు.. దిష్టి టెంకాయ: రాఫెల్ ను అందుకున్న రాజ్ నాథ్
Recommended Video
ప్యారిస్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేతికి అందాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విజయదశమి నాడు ఫ్రాన్స్ లో తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని అందుకున్నారు. ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ డసాల్ట్ ఏవియేషన్ సంస్థలో రాఫెల్ విమానానికి హిందూ సంప్రదాయాల ప్రకారం ఆయుధ పూజను చేశారు. కుంకుమతో ఓం అనే అక్షరాన్ని దిద్దారు. దిష్టి కోసం కొబ్బరికాయను కట్టారు. అక్షింతలు చల్లారు. యుద్ధ విమానం టైర్ల కింద నిమ్మకాయలను ఉంచారు. కొద్దిసేపటి తరువాత అందులో విహరించారు.
రాఫెల్ యుద్ధ విమానాల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వం ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం విలువ 59 వేల కోట్ల రూపాయలు. 36 రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసి భారత్ కు అందించేలా ఒప్పందం కుదిరింది. మిగిలిన యుద్ధ విమానాలు 2022 నాటికి తయారవుతాయి. అనంతరం వాటిని లాంఛనప్రాయంగా వైమానిక దళంలో ఇండక్ట్ చేస్తారు. విజయదశమి నాడే వైమానిక దళం 87వ వార్షికోత్సవ వేడుకలను జరుపుకోవడం, అదే రోజు రాఫెల్ తొలి యుద్ధ విమానం అందుకోవడం ఆనందంగా ఉందని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
అంతకుముందు ఆయన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్తో సమావేశం అయ్యారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య నెలకొన్న దౌత్య సంబంధాల గురించి చర్చించారు. రాఫెల్ యుద్ధ విమానాల తయారీ అనంతరం రెండు దేశాల మధ్య రక్షణ విభాగంలో కూడా సత్సంబంధాలు మరింత దృఢమయ్యాయని రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. రక్షణ రంగంలో ఇటీవల ఇరు దేశాల మధ్య మరింత అనుబంధం ఏర్పడిందని, ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. ఇద్దరూ నిర్ణయించారు.
'మేకిన్ ఇండియా' కార్యక్రమానికి మద్దతు ఇవ్వడంతో పాటు, వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడే విధంగా తమ దౌత్య సంబంధాలను కొనసాగిస్తామని అన్నారు. భారత్కు ఉపఖండ గగనతలంలో భారత్ శక్తిమంతంగా ఎదుగుతుందని ఆ దేశ వైమానిక దళానికి ఇక ఎదురు ఉండదని క్షిపణి వ్యవస్థలను రూపొందించిన ఎంబిడిఎ సంస్థ ప్రతినిధి లోయిక్ పియిడెవెక్ అభిప్రాయపడ్డారు. ఈ తరహా క్షిపణి వ్యవస్థ ప్రస్తుతం బ్రిటన్కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్, ఫ్రెంచ్ వైమానిక దళంలో మాత్రమే అందుబాటులో ఉంది. మెరుపు వేగంతో, చురుకైన రాడార్ వ్యవస్థతో క్షిపణి వ్యవస్థ అధునాతన రీతిలో, దేనికీ తీసిపోకుండా ఉంటుందని లోయిక్ తెలిపారు.