భారత్ - నేపాల్ సంబంధాలు అసాధారణమైనవి: రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: భారత్-నేపాల్ మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ - నేపాల్ దేశాల మధ్య బంధం రోటీ భేటీ లాంటిదని వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఉత్తరాఖండ్ జన్ సంవేద్ వర్చూవల్ ర్యాలీలో మాట్లాడారు.
Recommended Video
భారత్-నేపాల్ దేశాల మధ్య సంబంధాలు అసాధారణమైనవనీ.. ఈ బంధాన్నీ ప్రపంచంలో ఏ శక్తీ విచ్ఛిన్నం చేయలేదని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఏవైనా అపార్థాలు, వివాదాలు ఉంటే చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని తెలిపారు. రహదారి నిర్మాణం విషయంలో నేపాల్లో కొంత అపార్థం వ్యక్తమైందన్న రాజ్నాథ్.. లిపూలేఖ్ కనుమ ప్రాంతంలో బీఆర్ఓ నిర్మిస్తున్న రహదారి చాలా వరకు భారత సరిహద్దులోనే ఉందన్నారు.
నేపాల్లో సామాజిక, భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక సంబంధాలే కాకుండా ఆధ్యాత్మిక బంధం కూడా ఉందన్నారు. నేపాల్ పట్ల భారతీయుల్లో ఎలాంటి చేదు అనుభవం ఉండదని మాత్రం చెప్పగలను అని వ్యాఖ్యానించారు. భారత్ - నేపాల్ మధ్య బంధం ఎంతో లోతైనదన్నారు.
ఈ సమస్యకు చర్చల ద్వారా పరిష్కరించుకుందామని నేపాల్కు పిలుపునిచ్చారు. భారత భూ భాగాలైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ తీసుకొచ్చిన వివాదాస్పద కొత్త మ్యాప్కు నేపాల్ పార్లమెంట్లోని దిగువ సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే, ఈ చర్యను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. చారిత్రక ఆధారాలు, వాస్తవాలను పక్కన పెట్టి నేపాల్ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. నేపాల్ చేసిన పని ఆమోద యోగ్యం కాదన్నారు.