కరెక్ట్, బిజెపిలో రాజ్నాథ్ ఒక్కడే: కాంగ్రెస్ నేత ప్రశంస
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్కు విపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశంసలు అందాయి. బిజెపిలో రాజ్ నాథ్ ఒక్కరే విచక్షణ కలిగిన నేత అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రషీద్ అల్వీ అభిప్రాయపడ్డారు.
గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయిని కాంగ్రెస్ పార్టీ 'ది రైట్ మెన్ ఇన్ రాంగ్ పార్టీ' అనేది. ఇప్పుడు రాజ్నాథ్ పైన కాంగ్రెస్ నేత ప్రశంసలు కురిపించారు.
బీజేపీలో ఒక్క రాజ్నాథ్ సింగ్ మాత్రమే విచక్షణ కలిగిన నేత అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ అన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పార్టీ సీనియర్లు అద్వానీ, మురళి మనోహర్ జోషిల అభిప్రాయాలను కొట్టిపారేసే వైఖరి సరికాదని రాజ్నాథ్ సింగ్ పార్టీ నేతలకు సూచించారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో రషీద్ అల్వీ ప్రశంసించారు.
రాజ్నాథ్ వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని, ప్రస్తుత బిజెపిలో ఆయన ఒక్కరే తెలివి గల నేత అని రషీద్ అల్వీ అన్నారు. ప్రస్తుత బిజెపి పరిస్థితికి అద్వానీ, మురళీ మనోహర్ జీషీలే కారణమని చెప్పారు. చేసిన పొరపాటును సరిదిద్దే ప్రయత్నం చేసే వారిపై చర్యలకు బిజెపి సిద్ధపడటం విడ్డూరమని అభిప్రాయపడ్డారు.
కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఓటమి నేపథ్యంలో విపక్షాలు, మిత్రపక్షాల నుంచే కాక సొంత పార్టీ నేతల నుంచి కూడా బిజెపి అధిష్టానం విమర్శలు ఎదుర్కొంటోంది.
రెండు రోజుల క్రితం అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితర సీనియర్లు మాట్లాడుతూ.. బీహార్ ఓటమికి బాధ్యులను తేల్చాలన్నారు. దీనిపై కేంద్రమంత్రులు, పలువురు బిజెపి నేతలు ఘాటుగా స్పందించారు. అందరూ బాధ్యత తీసుకుంటారన్నారు. ఈ నేపథ్యంలో అసమ్మతి గళాలను (అద్వానీ, జోషి) అణచవద్దని రాజ్ నాథ్ అన్నారు.