జయ పార్థీవదేహాన్ని చూసి రజినీ కంటతడి: ప్రముఖుల నివాళి(వీడియో)
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థీవ దేహాన్ని చూసి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. రాజాజీ హాల్లోని ఆమె భౌతికకాయానికి మంగళవారం ఉదయం రజినీకాంత్ తన కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు. జయను చూసిన రజినీకాంత్ బావోద్వేగాన్ని అపుకోలేక కంటతడి పెట్టారు. ఆయన వెంట భార్య లత, కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్లు కూడా ఉన్నారు.
రజినీకాంత్ వర్సెస్ జయలలిత: అప్పుడలా.. ఆ తర్వాతిలా!
నివాళులర్పించిన అనంతరం రజినీకాంత్ అక్కడే ఉన్న జయ నెచ్చెలి శశికళ వద్దకు వెళ్లి ఆమెను ఓదార్చారు. కాసేపటి తర్వాత రజనీకాంత్ కుటుంబం అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇది ఇలా ఉండగా, గవర్నర్ విద్యాసాగర్, రావు, లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్, డీఎండీకే అధినేత విజయకాంత్లు జయ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. దేశం గొప్ప నాయకురాలిని కోల్పోయిందని ఈ సందర్భంగా సుమితా మహాజన్ అన్నారు. లక్షలాదిగా అభిమానులు, కార్యకర్తలు చెన్నైకి చేరుకుంటున్నారు.
కాగా, జయలలిత ప్రత్యర్థి డీఎంకే నేత కరుణానిధి కుటుంబసభ్యులు కూడా జయలలితకు నివాళులర్పించి వెళ్లారు. ఉదయాన్నే విపక్ష నేత, కరుణ చిన్న కుమారుడు ఎంకె స్టాలిన్ రాజాజీ హాలు వద్దకు వచ్చి జయకు నివాళులర్పించారు. అక్కడున్న ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం, శశికళ, ఇతర అన్నాడీఎంకే నేతలు, మంత్రులను ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
'అమ్మ' అని అందుకే పిలుచుకుంటారు: వెంకయ్య, రోశయ్య విచారం
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. దేశం ఒక విలక్షణ నేతను కోల్పోయిందని, ఆమె మరణం రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికి కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి కూడా జయ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
జయకు నేనంటే ప్రత్యేక అభిమానం: ఇంటికి వచ్చారని బాబు జ్ఞాపకాలు
అక్కడున్న అన్నాడీఎంకే నేతలను పలుకరించి వారికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. శశికళను కూడా పలకరించి ఓదార్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు జయలలిత చేసిన సేవలను కొనియాడారు. ఆమె ప్రజల మనసుల్లో చిరకాలం గుర్తుండిపోతారని తెలిపారు. సినీ నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఖుష్బు కూడా జయకు నివాళులర్పించారు.
వైయస్ లానే జయ, తీరని బాధ: తన పెళ్లికి వచ్చారని గుర్తు చేసిన రోజా
జయలలితకు వివిధ రంగాల ప్రముఖులు నివాళులర్పించారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్కిషన్ కౌల్ జయకు నివాళులర్పించారు. నడిగర్ సంఘం అధ్యక్షులు, నటుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, సినీ నటులు కోవై సరళ, టి రాజేందర్, శివకార్తీకేయన్ తదితర సినీ ప్రముఖులూ, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా జయలలితకు నివాళులర్పించారు. కాగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం ఉదయం నుంచీ జయ పార్థీవదేహం వద్దనే ఉన్నారు. మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖుల సోషల్ మీడియా వేదికగా జయ మృతికి నివాళులర్పించారు.