నంబర్ గేమ్: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల మద్దతు ఎవరికి..?
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ పదవికోసం జరగనున్న ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశం కనిపిస్తోంది. నువ్వానేనా అన్నట్లుగా ఈ పోరు జరిగనుంది. అధికార పార్టీ బీజేపీకి పెద్దల సభలో సరైన సంఖ్యా బలం లేకపోవడంతో వారు ఇప్పటికే అన్ని రకాల మార్గాలు వెతుకుతున్నారు. ఇదే క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేరు కమలనాథులు. ఇదిలా ఉంటే బీజేపీకి గట్టి షాక్ ఇవ్వాలని విపక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇందులో భాగంగానే విపక్షపార్టీలు ఎవరిని నిలబెట్టినా వారికి మద్దతు తెలుపుతామని కాంగ్రెస్ ప్రకటించింది.
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్గా గెలవాలంటే అభ్యర్థికి కావాల్సిన ఓట్లు 122. మొత్తం 245 మంది సభ్యులు రాస్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇందులో విపక్షాలకు 117 ఓట్లు ఉన్నాయి. అది కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురు మంది ఎంపీలతో కలిపితేనే ఈ సంఖ్య సాధ్యం అవుతుంది. రాజ్యసభ ఉపసభాపతి రేసులో తమ అభ్యర్థిని కూడా పోటీ పెట్టే యోచనలో తృణమూల్ కాంగ్రెస్ ఉంది. బరిలో నిలిపి ఇతర పార్టీల నుంచి మద్దతు కూడగట్టేందుకు దీదీ మమతా బెనర్జీ పావులు కదిపేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
వీరి ఓట్లే కీలకం కానున్నాయి
రాజ్యసభ ఉపసభాపతి పదవికోసం జరుగుతున్న పోటీలో నెంబర్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇటు అధికార పక్షం అటు విపక్షాలకు మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో పలు పార్టీల ఓట్లు కీలకంగా మారాయి . సభలో నామమాత్రంగా ఉండే పార్టీల అభ్యర్థుల ఓట్లే ఇప్పుడు కీలకం అయ్యాయి. బిజూ జనతాదళ్ పార్టీకి 9 ఓట్లు ఉండగా.. టీఆర్ఎస్కు ఆరు ఓట్లున్నాయి. వైసీపీకి రెండు ఓట్లున్నాయి. ఒక అభ్యర్థి విజయం సాధించాలంటే 122 ఓట్లు అవసరం. బీజేపీ ఒక్క పార్టీకే అత్యధికంగా 69 ఓట్లున్నాయి. అదే తమ మిత్రపక్షాలను, ఇండిపెండెంట్లను, నామినేటెడ్ పదవులతో కలిపి 115 ఓట్లున్నాయి. అయితే ఇక్కడ అమర్ సింగ్ అన్నాడీఎంకేకు చెందిన 13 మంది సభ్యులు బీజేపీకి మద్దతు పలుకుతారా లేదా అనేదానిపై కూడా ఎన్డీఏ అభ్యర్థి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
టీఆర్ఎస్ ఎవరి వైపు ఉంటుంది..?
ఇక విపక్షాల నంబర్స్ చూస్తే జూన్ నెలాఖరున మూడు రాజ్యసభ సీట్లు వచ్చి చేరాయి. కేరళ నుంచి రెండు కమ్యూనిస్టులకు ఒకట కాంగ్రెస్కు దక్కాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే టీఆర్ఎస్ ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి. బీజేపీ కాంగ్రెస్యేతర ప్రభుత్వం కేంద్రంలో రావాలంటూ పావులు కదిపిన కేసీఆర్కు ఒక్కింత నిరాశే ఎదురైంది. ఇందులో భాగంగానే కుమారస్వామి సీఎం ప్రమాణస్వీకారానికి కేసీఆర్ గైర్హాజరయ్యారు. కాంగ్రెస్తో వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే గులాబీ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో 15వ ఆర్థిక సంఘంపై జరిగిన రాష్ట్ర ఆర్థిక మంత్రుల సదస్సుకు తెలంగాణ నుంచి ఆర్థికమంత్రి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా హాజరుకాలేదు. టీఆర్ఎస్ తొలి శత్రువు కాంగ్రెస్ కాబట్టి... కాంగ్రెసేతర విపక్ష అభ్యర్థి టీఆర్ఎస్ మద్దతు కోరే అవకాశం ఉంది.
బీజేడీ ఎవరివైపు, అన్నాడీఎంకే ఎవరికి మద్దతు ఇస్తుంది..?
ఇక నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ ఇప్పటి వరకు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీతో, ఇటు కాంగ్రెస్తో సమాన దూరం మెయింటెయిన్ చేస్తూ వస్తోంది. అయితే కీలక బిల్లులు పాస్ చేసే క్రమంలో బీజేపీకి అండగా నిలుస్తూ వచ్చింది. ఇక కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి కూడా ఒడిషా ముఖ్యమంత్రి పట్నాయక్ దూరంగా ఉన్నారు. కేంద్రంలో ఏపార్టీ అధికారంలోకి వచ్చినా బీజేడీ మద్దతు కోసం వెంటపడాల్సిందేనన్న ఫిలాసఫీ కలిగి ఉన్న నేత ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్. మొన్న అవిశ్వాస తీర్మానం సందర్భంగా కూడా బీజేడీ ఎంపీలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. మరి ఈ సారి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక కీలకం కనుక వీరు ఓటింగ్లో పాల్గొంటారా లేక తటస్థంగా ఉంటారా అనేది ఆసక్తి కరంగా మారింది. ఒకవేళ ఓటింగ్లో పాల్గొంటే ఎవరికి మద్దతు ఇస్తారు అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని మోడీ సర్కార్ ఒక కాపు కాస్తా వచ్చింది. అయితే ఆ పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.
వైసీపీ మద్దతు ఎవరికి..?
ఇక ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ కోసం ముందునుంచి పోరుబాట సాగిస్తున్న వైసీపీకి రాజ్యసభలో ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారు. అయితే ప్రత్యేక హోదా ఇవ్వకుండా కాలం వెల్లదీస్తున్న బీజేపీకి రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చేది లేదని ఇప్పటికే వైసీపీ నేత రాజ్యసభ ఎంపీ విజయ్ సాయిరెడ్డి చెప్పారు. అయితే విపక్ష పార్టీలకు మద్దతు ఇస్తారా... లేదా ఎన్డీఏలోని బీజేపీయేతర అభ్యర్థికి మద్దతు ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ ఎన్నికల్లో దూరంగా ఉండి మైలేజ్ పొందడమే వైసీపీ లక్ష్యంగా ఉంది.