టీ తెచ్చిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్: రాత్రంతా గాంధీ విగ్రహం వద్దే: పాటలు పాడుతూ
న్యూఢిల్లీ: వ్యవసాయ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా రాజ్యసభలో దురుసుగా ప్రవర్తించిన ఎనిమిది మంది సభ్యుల సస్పెన్షన్ వ్యవహారం ఇంకా చల్లారలేదు. తమను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఎనిమిది మంది సభ్యులు రాత్రంతా పార్లమెంట్ ఆవరణలోనే గడిపారు. జాతిపిత మహాత్మాగాాంధీ విగ్రహం వద్ద దీక్ష కొనసాగించారు. పాటలు పాడుతూ గడిపారు. వారికి మద్దతుగా పలువురు లోక్సభ, రాజ్యసభ సభ్యులు సైతం దీక్షలో కూర్చున్నారు. రాత్రంతా గాంధీ విగ్రహం వద్దే గడిపిన వారిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్ పరామర్శించారు. వారి కోసం వేడివేడి టీ తీసుకొచ్చారు.
రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఓటింగ్ సందర్భంగా వేర్వేరు ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు దురుసుగా ప్రవర్తించారు. పోడియం వైపునకు దూసుకెళ్లడం, వ్యవసాయ బిల్లు కాపీలను చింపి గాల్లోకి విసిరేయడ వంటి చర్యలకు దిగారు. దీనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, సీపీఎం ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన ఎనిమిది సభ్యులు సస్పెన్షన్ వేటు పడిన వారిలో ఉన్నారు.
తృణమూల్ కాంగ్రెస్కు చెందిన డెరెక్ ఒబ్రియాన్, డోలాసేన్, కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ సతవ్, రిపున్ బోరా, సయ్యద్ నాసిర్ హుస్సేన్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సంజయ్ సింగ్, సీపీఎం సభ్యులు కేకే రాగేష్, ఎళమరం కరీమ్లను రాజ్యసభ ఛైర్మన్ సస్పెండ్ చేశారు. వారం రోెజుల పాటు సభకు హాజరు కావొద్దని ఆదేశించారు. సస్పెన్షన్కు గురైన అనంతరం వారంతా పార్లమెంట్ ఆవరణలోనే గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. నిరసన దీక్ష చేపట్టారు. రాత్రంతా అక్కడి నుంచి కదల్లేదు. ఆయా పార్టీలకు చెందిన మరికొందరు ఎంపీలు వారితో కలిశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల సంక్షేమానికి సంబంధించిన పాటలు పాడుతూ గడిపారు.
#WATCH: Rajya Sabha Deputy Chairman Harivansh brings tea for the Rajya Sabha MPs who are protesting at Parliament premises against their suspension from the House. #Delhi pic.twitter.com/eF1I5pVbsw
— ANI (@ANI) September 22, 2020
Recommended Video
తెల్లవారు జామునే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ వారిని పలకరించారు. వారికోసం టీ, బిస్కెట్లను తీసుకొచ్చారు. వారితో కలిసీ టీ సేవించారు. రైతుల సంక్షేమం కోసమే ఈ బిల్లులను తీసుకొచ్చారని వివరించే ప్రయత్నం చేశారు. వ్యవసాయ బిల్లులో పొందుపరిచిన అనేక అంశాలు, సవరణలను సెలెక్ట్ కమిటీకి పంపించాలంటూ ప్రతిపక్ష సభ్యులు చేసిన సూచనలను ఆమోదయోగ్యంగా లేవని, మెజారిటీ సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం వల్లే ఆమోదింపజేశామనీ హరివంశ్ చెప్పుకొచ్చారు. రైతుల సంక్షేమాన్ని ఏ ప్రభుత్వం కూడా విస్మరించలేదనీ అన్నారు.