ఘర్ వాపసీ: మతమార్పిడిపై రాజ్యసభలో ఆందోళన
న్యూఢిల్లీ: మత మార్పిడి అంశంపై రాజ్యసభలో విపక్ష సభ్యుల ఆందోళన కొనసాగుతోంది. సోమవారం కూడా విపక్షాలు ఆందోళన చేశాయి. సభ్యులు ఎంతకూ శాంతించకపోవడంతో రాజ్యసభ చైర్మన్ సభను వాయిదా వేయవలసి వచ్చింది. సభను రెండు గంటల వరకు వాయిదా వేశారు. కాగా, బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ దాస్ లక్నోలో మాట్లాడుతూ.. 'ఘర్ వాపసీ'ని ఆమోదించాలని డిమాండ్ చేశారు.
ఆరెస్సెస్ ఎజెండా: సి.రామచంద్రయ్య
ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు వ్యవహార సరళిపై కాంగ్రెస్ పార్టీ నేత సీ రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.
మోడీ సర్కారు జాతీయవాదాన్ని బలోపేతం చేస్తున్న వైనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. లౌకికవాది అయిన పటేల్ను పొగుడుతున్న మోడీ సర్కారు ఆయన సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. జాతీయవాదానికి మతం రంగు పులుముతోందన్నారు.
పటేల్ ఆశయాలకనుగుణంగా ముందుకు సాగుతున్నామని చెబుతున్న బీజేపీ ప్రభుత్వం ఆరెస్సెస్ అజెండాను భుజానికెత్తుకుంటోందని విమర్శించారు. దేశ సమగ్రతను కాపాడే విధంగా మోడీ సర్కారు నడచుకోవాలని ఆయన సూచించారు. మతపరమైన జాతీయవాదాన్ని ప్రోత్సహించవద్దన్నారు.
ఆయుధాలు వీడి కాంగ్రెస్లోకి రండి: దిగ్విజయ్
ఆయుధాలు విడనాడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ నక్సల్స్కు పిలుపునిచ్చారు. నేపాల్లో మావోయిస్టులు జాతీయ జనజీవన స్రవంతిలో కలిసినట్టుగా దేశంలోని మావోయిస్టులు కూడా ప్రజల్లోకి రావాలని, క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనాలని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ సరైన పార్టీ అని నక్సల్స్ భావిస్తే ఆ పార్టీలోకి రావొచ్చునని, వారందరికీ ఆహ్వానం పలుకుతామని దిగ్విజయ్ పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ చింతన్ శిబిర్లో మాట్లాడిన దిగ్విజయ్ గతంలో కూడా జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రకమైన పిలుపునిచ్చారు.
జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో తానేం చెప్పానో తనకు గుర్తుందని చాలా స్పష్టంగానే మాట్లాడానని దిగ్విజయ్ సింగ్ అన్నారు. హింసా రాజకీయాలను విడనాడి ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి రావాలనే తాను ఆ సందర్భంగా నక్సల్స్కు పిలుపునిచ్చానని స్పష్టం చేశారు.