నేను బిజెపికే ఓటేశా, మిగిలినవారి గురించి తెలియదు: బిఎస్పీ ఎమ్మెల్యే అనిల్కుమార్ సింగ్
లక్నో: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన రెండు పార్లమెంట్ స్థానాల్లో బిజెపిని ఓటమి పాలు చేసింది సమాజ్ వాదీ పార్టీ. ఈ ఎన్నికల్లో బిఎస్పీతో కలిసి సమాజ్ వాదీ పోటీ చేసింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో బిఎస్పీ,ఎస్పీ కూటమికి చెక్ పెట్టేందుకు బిజెపి ప్లాన్ చేసింది. ఈ మేరకు బిఎస్పీ ఎమ్మెల్యే అనిల్ సింగ్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బిజెపి అభ్యర్ధికి ఓటేసినట్టు ప్రకటించారు. తమ పార్టీకి చెందిన మిగతా ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేశారో తనకు తెలియదన్నారు.
Recommended Video
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో పది రాజ్యసభ స్థానాలకు శుక్రవారం నాడు ఎన్నికలు జరుగుతున్నాయి యూపీ రాష్ట్రంలో ఒక్క రాజ్యసభ అభ్యర్ధి విజయం సాధించాలంటే సుమారు 37 మంది ఎమ్మెల్యేలు ఓటు చేయాల్సి ఉంటుంది.
యూపీ అసెంబ్లీలో ఉన్న బలం మేరకు బిజెపికి 8 సీట్లు దక్కనున్నాయి. ఎస్పీ, బిఎస్పీకి చెరో సీటు దక్కే అవకాశాలున్నాయి. అయితే బిఎస్పీకి చెందిన ఎమ్మెల్యేలకు బిజెపి గాలం వేసిందనే ప్రచారం సాగుతోంది.
దీంతో బిఎస్పీ అభ్యర్ధి స్థానాన్ని కూడ తాము దక్కించుకోవాలని బిజెపి పావులు కదుపుతోంది.బిఎస్పీకి 19 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎస్పీ నుండి 10 మంది, కాంగ్రెస్ నుండి ఏడుమంది, అజిత్ సింగ్ పార్టీ నుండి ఒక్కరు బిఎస్పీ అభ్యర్ధికి మద్దతివ్వాలని ప్లాన్ చేశారు.
కానీ, బిఎస్పీకి చెందిన ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్ధికి క్రాస్ ఓటింగ్కు పాల్పడడడం బిఎస్పీ అభ్యర్ధి విజయావకాశాలపై పడనుంది. బిఎస్పీ ఎమ్మెల్యే అనిల్కుమార్ సింగ్ తాను బిజెపి అభ్యర్ధికి ఓటేసినట్టు ప్రకటించడం కలకలం రేపుతోంది.
తాము తొమ్మిదో స్థానాన్ని కూడ కైవసం చేసుకొంటామని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ధీమాను వ్యక్తం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడ క్రాస్ ఓటింగ్కు పాల్పడడం లేదని ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ ప్రకటించారు. అయితే బిఎస్పీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సింగ్ చేసిన ప్రకటన బిఎష్పీ వర్గాల్లో ఆందోళన కల్గిస్తోంది.