3.5గంటల్లో 7 కీలక బిల్లులు పాస్ - రాజ్యసభలో అనూహ్యం - రేపటితో పార్లమెంట్ నిరవధిక వాయిదా?
రాజ్యసభలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై వివాదం నెలకొన్నవేళ మరో అనూహ్య దృశ్యం చోటుచేసుకుంది. కేవలం మూడున్నర గంటల వ్యవధిలో ఏకంగా ఏడు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఎంపీలపై సస్పెన్షన్ వేటును నిరసిస్తూ విపక్షాలు బాయికాట్ చేయగా.. దాన్ని అనుకూలతగా భావించి ప్రభుత్వం బిల్లుల్ని ఫటాఫట్ ఆమోదింపజేసుకుంది.
లోక్సభ సమావేశాల బహిష్కరణ - విపక్షాల తీవ్ర నిర్ణయం - రాజ్యసభ సస్పెన్షన్లపై రగడ
ఆ 7 బిల్లులు ఇవే..
పెద్దగా చర్చలేకుండానే మంగళవారం రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లుల్లో కీలకమైన ఐఐఐటీ సవరణ చట్టం బిల్లు, నిత్యావసరాల చట్ట సవరణ, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్ట సవరణ, కంపెనీ చట్ట సవరణ, జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయ చట్ట చవరణ, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ బిల్లు, పన్ను చట్ట సవరణ బిల్లులు ఉన్నాయి.
షాకింగ్:పాకిస్తాన్ కుట్ర బట్టబయలు - పరోక్షయుద్ద సామాగ్రి పట్టివేత - భారీ ఖర్చుతో మనోళ్ల యాంటీ ప్లాన్
సభలో ఉన్నదే వీళ్లే..
రాజ్యసభలో ఎంపీలపై సస్పెన్షన్ వేటును నిరసిస్తూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, నేషనలిస్ట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల ఎంపీలు సమావేశాలను బాయికాట్ చేశారు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ బిల్లుల్ని పాస్ చేయించుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది. మూడున్నర గంటల్లో ఏడు బిల్లులు పాసైన సమయంలో సభలో బీజేపీతోపాటు వైసీపీ, జేడీయూ, అన్నాడీఎంకే, బీజేడీ ఎంపీలు ఉన్నారు.
సస్పెన్షన్లపై రగడ..
వ్యవసాయ బిల్లులపై ఓటింగ్ సందర్భంగా రాజ్యసభలో ఆదివారం కనీవినీ ఎరుగని పరిణామాలు చోటుచేసుకోవడం తెలిసిందే. డివిజన్ ఓటింగ్ పెట్టాలని విపక్షాలు కోరినా పట్టించుకోకుండా.. ఎన్డీఏకు మెజార్టీ లేకపోయినా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ బిల్లులు పాస్ అయ్యాయని ప్రకటించడం వివాదాస్పదమైంది. డిప్యూటీ చైర్మన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెల్ లోకి వెళ్లి నిరసన తెలిపిన ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్ష్ వేటు పడింది. దీంతో ఆ ఎంపీలు సోమవారం రాత్రంతా పార్లమెంట్ ఆవరణలోనే దీక్ష నిర్వహించారు. మంగళవారం ఉభయసభల్లోనూ ఎంపీల సస్పెన్షన్ అంశంపై రగడ కొనసాగింది. చివరికి ఉభయ సభలను విపక్షాలు బాయికాట్ చేశాయి.
ఇక నిరవధిక వాయిదానే..
వ్యవసాయ బిల్లుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న విపక్షాలు ఏకంగా బహిష్కరణ నిర్ణయం తీసుకోవడంతో వర్షాకాల సమావేశాలను ఇంతటితో ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. బాయికాట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా విపక్ష ఎంపీలతో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశం నిర్వహించినా పాజిటివ్ ఫలితం రాలేదు. సర్కారు బిల్లుల్ని వెనక్కి తీసుకుంటేనే సభకు హాజరవుతామని విపక్షాలు స్పష్టం చేశాయి. ఈ దశలో సభను నిర్వహించడం కుదరదని, పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసే ప్రకటన బుధవారమే వెలువడొచ్చని తెలుస్తోంది.