మూడు కీలక బిల్లులకు రాజ్యసభ ఆమోదం: నిరవధిక వాయిదా, రాష్ట్రపతితో విపక్షాల భేటీ
న్యూఢిల్లీ: రాజ్యసభ బుధవారం మూడు కీలక లేబర్ చట్టాలకు ఆమోదం తెలిపింది. ఆక్యుపెషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 బిల్లులకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను మంగళవారం లోక్సభ ఆమోదించింది.
అనంతరం రాజ్యసభను నిరవధిక వాయిదా వేశారు. అక్టోబర్ 1 వరకు వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ.. కరోనా మహమ్మారి కారణంగా ఆ గడువును కుదించారు. ప్రతిపక్షాలు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఇప్పటికే సమావేశాలను వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే, కరోనా కారణంగా 18 రోజులపాటు జరగాల్సిన ఈ సమావేశాలు 10 రోజులే జరిగాయని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ పది రోజుల్లోనే రాజ్యసభలో 25 బిల్లులకు ఆమోదం లభించింది. ఈ సమావేశాల ఉత్పాదకత 100.47 శాతంగా ఉందని తెలిపారు. 198 మంది ఎంపీలు రాజ్యసభ చర్చలో పాల్గొన్నారని, 1567 అన్ స్టార్ ప్రశ్నలకు సమాధానలు ఇచ్చినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు.
అంతేగాక, పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పార్లమెంటు ఆవరణలోనే నిరసన ప్రదర్శనలకు దిగారు. బిల్లులను వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో మార్చ్ నిర్వహించారు. ఇక వ్యవసాయ బిల్లులపై సంతకాలు చేయొద్దంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ను బుధవారం సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ సహా విపక్షాలు కలవనున్నాయి.
అయితే, కేవలం ఐదు విపక్ష పార్టీ నాయకులకు మాత్రమే రాష్ట్రపతి కార్యాలయం నుంచి అనుమతి లభించింది. కరోనా నిబంధనల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రపతిని ప్రతిపక్షాలు అపాయింట్ మెంట్ కోరిన విషయం తెలిసిందే.
#WATCH: MPs of Opposition parties march in Parliament premises in protest over farm bills. Placards of 'Save Farmers' & 'Save Farmers, Save Workers, Save Democracy' seen.
— ANI (@ANI) September 23, 2020
Congress' Ghulam Nabi Azad, TMC's Derek O'Brien, and Samajwadi Party's Jaya Bachchan present, among others. pic.twitter.com/PIIxqciFpG
కాగా, వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్త ఆందోళనలకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. అయితే, కేంద్రం కూడా అదే స్థాయిలో విపక్షాలపై మండిపడుతోంది. రైతులకు మేలు చేసే బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులకు చేకూరే ప్రయోజనాలను అడ్డుకుంటున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.