రాజ్యసభ ఎన్నికలు 2020: మేడం విజ్ఞప్తికి ఓకే అన్న దేవెగౌడ.. పెద్దల సభకు జేడీఎస్ బాస్
బెంగళూరు: కర్నాటకలో ఎన్నికల వేడి కనిపిస్తోంది. జూన్ 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో జేడీఎస్ కురవృద్ధుడు మాజీ ప్రధాని దేవెగౌడ నిలవనున్నారు. ఈమేరకు ఆయన మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారని కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు చాలామంది జాతీయ స్థాయి నాయకులు, పార్టీ ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు తన తండ్రి రాజ్యసభకు పోటీచేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు కుమారస్వామి చెప్పారు. అయితే దేవెగౌడను ఒప్పించడం చాలా కష్టమైందని కుమారస్వామి ట్వీట్ ద్వారా తెలిపారు.
మాజీ ప్రధాని దేవెగౌడ విజయాలను అపజయాలను రెండింటిని ఎదుర్కొన్నారని చెప్పారు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి. ప్రజలే తన తండ్రికి విజయాన్ని అందించి మంచి స్థానంలో కూర్చోబెట్టారని గుర్తుచేశారు కుమారస్వామి. అయితే రాజ్యసభకు మాత్రం వెళ్లేందుకు ఒప్పించాలంటే చాలా కష్టపడినట్లు చెప్పిన కుమారస్వామి ఎట్టకేలకు తన తండ్రి అందరి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఆమోదం తెలిపారని వెల్లడించారు. అసెంబ్లీలో జేడీఎస్కు 34 సీట్లు ఉన్నాయి. అయితే ఒంటరిగా అయితే జేడీఎస్కు రాజ్యసభ సీటు ఒక్కటి కూడా రాదు. కాంగ్రెస్ మద్దతుతోనే ఈ సీటు దక్కింది. అయితే రాజ్యసభకు వెళ్లాలంటే ఒక అభ్యర్థికి 44 ఓట్లు కావాల్సి ఉంది. రాజ్యసభకు దేవెగౌడ వెళితే తను పెద్దల సభకు రెండో సారి వెళ్లినట్లు అవుతుంది. తొలిసారిగా ఆయన 1996లో ప్రధానిగా పనిచేసిన సమయంలో రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.
2019 లోక్సభ ఎన్నికల్లో తూముకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన 87 ఏళ్ల దేవెగౌడ బీజేపీ అభ్యర్థి జీఎస్ బసవరాజ్పై 13వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్-జేడీఎస్ అభ్యర్థిగా బరిలో నిల్చిన దేవెగౌడ తూముకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు హసన్ నియోజకవర్గం నుంచి దేవెగౌ పోటీచేయాలని భావించినా...ఆ సీటును తన మనవడు అయిన ప్రజ్వల్ రేవన్నకు త్యాగం చేశారు. ప్రజ్వల్ హసన్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
Recommended Video
కర్నాటకలో నాలుగు రాజ్య సభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. కాంగ్రెస్కు చెందిన రాజీవ్ గౌడ, బీకే హరిప్రసాద్లు రిటైర్ కానుండగా.. బీజేపీ నుంచి ప్రభాకర్ కోరే జేడీఎస్ నుంచి కూపేంద్ర రెడ్డిల పదవీకాలం జూన్ 25తో ముగియనుంది. ఇక నామినేషన్ దాఖలు చేసేందుకు జూన్ 9 చివరితేదీ. కాంగ్రెస్కు 68 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఆ పార్టీకి 1 సీటు వచ్చే అవకాశం ఉంది. ఈ సీటుకు గాను సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేను బరిలోకి దింపింది కాంగ్రెస్. ఇక బీజేపీ విషయానికొస్తే 117 మంది సభ్యులతో రెండు సీట్లు దక్కుతాయి. అయితే దేవెగౌడకు వ్యతిరేకంగా బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని బరిలో నిలపకూడదని భావించినట్లు సమాచారం.