ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా: అప్రమత్తమైన కాంగ్రెస్, రిసార్టులకు మిగితా ఎమ్మెల్యేలు
అహ్మదాబాద్: జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగలడంతో అప్రమత్తమైంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలందర్నీ శనివారం రిసార్టులకు తరలించింది. కాంగ్రెస్ పార్టీకి జూన్ 3న అక్షయ్ పటేల్, జితూ చౌదరి రాజీనామా చేయగా, జూన్ 5న మరో ఎమ్మెల్యే బ్రిజేష్ మీర్జా రాజీనామా చేశారు.
ఈ క్రమంలో 182 స్థానాలు గల సభలో కాంగ్రెస్ బలం 65కు పడిపోయింది. రాజీనామాలు, కోర్టు కేసులతో సభలో 10 స్థానాలు ఖాళీగా ఉండటంతో సభలో ఇప్పుడు మొత్తం 172 సభ్యులు మాత్రమే ఉన్నారు.
బనస్కంత జిల్లాలోని అంబాజీ సమీపంలోని ఓ రిసార్టుకు ఉత్తర గుజరాత్ కు చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తరలించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సౌత్, సెంట్రల్ గుజరాత్ కు చెందిన ఎమ్మెల్యేలను ఆనంద్లోని ఓ ప్రైవేటు బంగ్లాకు మార్చారు. సౌరాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేలను రాజ్కోట్లోని రిసార్టుకు తరలించినట్లు కాంగ్రెస్ నేత మనీష్ దోషి తెలిపారు.