భళా రాజ్యవర్ధన్ భళా: ఏకాగ్రతకు ఓ ట్రిక్ సూచించిన ఎంపీ..వీడియో వైరల్
ప్రముఖులు ఏమి చేసినా అది పెద్ద వార్తే అవుతుంది. ఇక ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తే కొన్ని గంటల్లోనే కొన్ని లక్షల వ్యూస్ వస్తాయి. తాజాగా కేంద్ర మాజీ మంత్రి బీజేపీ ఎంపీ రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ చేసిన ఓ కాయిన్ ట్రిక్ వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆయన చేసిన కాయిన్ ట్రిక్ నెటిజెన్లను ఆకట్టుకుంటోంది.
ముందుగా తన చేతిపై మూడు కాయిన్లను రాథోడ్ ఉంచారు. ఆ మూడు కాయిన్లను ఒకేసారి గాల్లోకి విసిరారు. తిరిగి అన్ని కాయిన్లను ఒకే సారి పట్టుకున్నారు. ఒక్క కాయిన్ కూడా నేలపై పడకుండా ఒకే ప్రయత్నంలో పట్టుకున్నారు. స్వతహాగా క్రీడాకారుడైన రాజ్యవర్థన్ సింగ్ ఇలాంటి ట్రిక్కులు చాలా చేసేవాడట. షూటింగ్ సమయంలో ఈ కాయిన్ ట్రిక్ ఎక్కువగా చేసేవారట. ఇలా చేయడం వల్ల తన చేతికి కంటికి సమన్వయం ఏర్పడుతుందని తన పోస్టులో రాసుకొచ్చారు రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్. ఒక వేళ ఎవరైనా దీన్ని చేయాలని ప్రయత్నిస్తే వారికి షరతులు విధించారు. కాయిన్స్ అస్సలు నేలను తాకరాదనే షరతును విధించారు.
ఇక తన పోస్టుకు ఏడు హ్యాష్ట్యాగులను రాథోడ్ రాశారు. కాయిన్ ట్రిక్ను ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని చెప్పారు. ఇక తను చేసిన కాయిన్ ట్రిక్గల వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే 1.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతేకాదు ఈ వీడియోను చూసిన వారు షేర్ కూడా చేస్తుండటంతో ఆ సంఖ్య మరింత పెరిగింది. నెటిజెన్లు కూడా తమ కామెంట్ల వర్షం కురిపించారు. రాజ్యవర్థన్ రాథోడ్ చాలా ఉత్సాహంగాను అలర్ట్గాను ఉన్నారంటూ కొందరు నెటిజెన్లు కామెంట్ చేశారు.
మరికొందరు మాత్రం రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఏది చేసినా చాలా భిన్నంగా చేస్తారని సవాలుతో కూడిన పనులు మాత్రమే చేస్తారని అభినందించారు. ఇక నెటిజెన్ల జాబితాలో ప్రముఖ నటుడు వివేక్ ఓబ్రాయ్ కూడా చేరిపోయాడు. రాజ్యవర్థన్ చేసిన ట్రిక్కు చాలా పర్ఫెక్ట్గా ఉందని అభినందించిన వివేక్ ఓబ్రాయ్... తన పిల్లలకు ఈ వీడియో చూపించినట్లు చెప్పాడు. ఇప్పుడు తన ఇంటిలో మొత్తం కాయిన్స్ పడిఉన్నాయని రాసుకొచ్చారు.